వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు.. బ్రేక్ పడింది ఇందుకేనంటూ బాంబు పేల్చిన మంత్రి బాలినేని
ప్రతిపక్ష టీడీపీ నుంచి అనధికారికంగానైనా సరే వైసీపీలో చేరేందుకు ఏడు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని.. ఫలానా జిల్లాలో ఫలానా మంత్రి చక్రం తిప్పడంలో చేరికలకు రూట్ క్లియరైందని.. వారంతా విడివిడిగా ముఖ్యమంత్రి జగన్ ను కలవబోతున్నారంటూ కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ వాస్తవంగా టీడీపీ నుంచి జంపింగ్స్ లేకపోగా.. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో తాము తెలుగుదేశం అభ్యర్థికే ఓటేశామని రెబల్స్ చెప్పుకున్న పరిస్థితి. ఒకదశలో టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు రెడీ అయినా.. అనూహ్య పరిణామాలతో జంపింగ్ లకు బ్రేక్ పడినట్లు వెల్లడైంది. దాని వెనకున్న కారణాలను స్వయంగా మంత్రివర్యులే వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మీడియాతో బాలినేని..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో తిరిగి చేరేందుకు న్యాయపోరాటం చేస్తోన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇటీవల బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, ఆ పార్టీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ లను రహస్యంగా కలుసుకోవడం సంచలనం రేపింది. రెండ్రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారంపై మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

వలసలకు బ్రేక్ అందుకే..
ఎంపీ సుజనా చౌదరి పేరుకు మాత్రమే బీజేపీలో కొనసాగుతున్నా.. ఇప్పటికీ టీడీపీకి చెందిన అన్ని వ్యవహారాలను ఆయనే చక్కబెడుతున్నారని, నిజానికి సుజనా.. చంద్రబాబు ఏజెంట్ గానే బీజేపీలో చేరారని మంత్రి బాలినేని ఆరోపించారు. అంతటితో ఆగకుండా సుజనాను కడిగేసే క్రమంలో ఎమ్మెల్యేల జంపింగ్ వ్యవహారాన్నీ మంత్రి బయటపెట్టారు. ‘‘బీజేపీ ఎంపీ సుజనా చౌదరి టీడీపీలో ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నాడో నాకు తెలుసు. కొంత మంది టీడీపీ నేతలు వైసీపీలోకి చేరాలని నిర్ణయించుకోగా.. వాళ్లను పిలిపించుకుని సుజనా మంతనాలు జరిపాడు. పార్టీ మారకుండా వాళ్లను ఆపు చేయించాడు..'' అని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాకు సంబందించి టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి శిద్ధారాఘవరావులు వైసీపీలోకి రావడంలో మంత్రిదే కీలక పాత్ర అని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అందుకేనా టార్గెట్ చేశారంటూ..
వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేల చేరికల్ని సుజనాయే అడ్డుకున్నట్లు మంత్రి బాలినేని చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. చంద్రబాబుపై విమర్శలు చేసే క్రమంలో ప్రస్తావనలు.. సీఎం జగన్ గేట్లు తెరిస్తే ఆ పార్టీలో ఒక్కరూ మిగలరు.. తరహా కామెంట్లు తప్ప టీడీపీ ఎమ్మెల్యేల చేరికలు ఎందుకు ఆగిపోయాయో వైసీపీ ముఖ్యనేతలెవరూ బాలినేనిలాగా బోల్డ్ గా మాట్లాడిన సందర్భాలు లేవు. మంత్రి మాటలను బట్టి ప్రలోభాల పర్వం రెండు పార్టీల్లోనూ జరిగినట్లు అర్థమవుతోన్నట్లు అనలిస్టులు వ్యాఖ్యానించారు. వైసీపీకి మింగుడు పడటంలేదు కాబట్టే తమ వాళ్లను టార్గెట్ చేస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

నిమ్మగడ్డ ఇంకా ఎస్ఈసీనా?
పార్క్ హయత్ హోటల్ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. వైసీపీ నేతలు చేస్తోన్న విమర్శలకు కౌంటర్ గా.. ‘‘జగన్ సర్కారు నిమ్మగడ్డను ఇంకా ఎస్ఈసీగానే గుర్తిస్తున్నదా? పదవిలో లేనప్పుడు ఆయన ఎవరిని కలిస్తే మీకెందుకు?'' అంటూ టీడీపీ, బీజేపీ నాయకులు ప్రశ్నలు సంధించారు. బుధవారంనాటి ప్రెస్ మీట్ లో మంత్రి బాలినేని.. నిమ్మగడ్డను ఎన్నికల అధికారిగా పేర్కొనడం, ఏదైనా పనుంటే అధికారికంగా ఆఫీసులో కాకుండా హోటల్ లో కలవడమేంటని అనడం కూడా విమర్శలకు తావిచ్చినట్లయింది.
Recommended Video

ఆ భేటీ వెనుక రహస్యమిదే..
నిమ్మగడ్డ, సుజనా, కామినేని రహస్య భేటీ వెనుక కుట్ర దాగుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ.. మంత్రి బాలినేని మాత్రం అదేంటో బయటపెట్టేశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు స్పష్టంగా అర్థమైన తర్వాతే, నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికలకు అడ్డంకులు సృష్టించారని, ఆయనను పదవి నుంచి తొలగించి సీఎం జగన్ చాలా మంచి పని చేశారని, అయితే నిమ్మగడ్డ మళ్లీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. సీక్రెట్ మీటింగ్ వ్యవహారాన్ని కోర్టులు వెంటనే పరిశీలనలోకి తీసుకోవాలి, ఆ ముగ్గురికీ న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తప్పవని బాలినేని అన్నారు.












Click it and Unblock the Notifications