అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టారా ? తనకు తెలీదన్న బొత్స-తప్పేముందని ప్రశ్న
విజయనగరం: ఏపీలో సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన వైసీపీ సీనియర్ నేత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ విద్య పథకానికి ప్రభుత్వం పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం తనకు తెలియదని ఆయన ఇవాళ మీడియాకు వెల్లడించారు. అయినా అందులో తప్పేముందన్నారు.
ఏపీలో స్కూళ్ల విలీనాలు, మూసివేతలపై తల్లితండ్రులు, విద్యార్ధుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాష్ట్రంలో ఒక్క స్కూలు కూడా మూతపడబోదన్నారు. దీనికి తనదే హామీ అన్నారు. అంతే కాదు ఇప్పుడు విలీనం అవుతున్న స్కూళ్ల స్ధానంలో ఫౌండేషన్ స్కూళ్లు వస్తాయన్నారు. రాష్ట్రంలో 270 స్కూల్స్ లో విలీన సమస్య ఉన్నట్టు కూడా గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. ఏయే స్కూల్స్తో సమస్య వుందో తెలియచేయని సంబంధిత శాసనసభ్యులను కోరామన్నారు. విద్యార్ధులకు స్కూళ్లకు వెళ్లేందుకు వాగులు, వంకలు, రోడ్ల సమస్యలు ఉన్నందున జీవో 117లో సవరణలు చేశామన్నారు. క్లాసులో 21 మంది విద్యార్ధులు దాటితే ఓ ఎస్టీటీ టీచర్ ను ఇస్తున్నామని బొత్స తెలిపారు. అలాగే స్కూల్లో 150 మంది దాటితే హెడ్ మాస్టర్ ను కూడా కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చిన విషయం తనకు తెలియదని విద్యామంత్రి బొత్స తెలిపారు.అయినా విదేశీ విద్యకు జగనన్న పేరు పెట్టడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. అయినా దీనిపై మరోసారి పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విదేశీ విద్యపథకానికి అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న పేరు పెట్టడంపై విపక్ష నేత చంద్రబాబు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మంత్రి బొత్స ముందు ప్రస్తావించగా.. ఆయన ఇలా వివరణ ఇచ్చారు.