ఉద్యోగాల సంఘాల నేతలకు మంత్రి బుగ్గన హామీ: ప్రభుత్వం సానుకూలం, ఉద్యమం తాత్కాలిక వాయిదా
అమరావతి: ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు, జేసీసీ నేతలతో గురువారం సమావేశమయ్యారు మంత్రి బుగ్గన. పెండింగ్ అంశాలపై చర్చ జరిపినట్లు ఆయన తెలిపారు. చాలా రోజులుగా వారు ఇచ్చిన విజ్ఞప్తులను తీసుకున్నామని, కరోనా సహా వివిధ అంశాల వల్ల ఈ అంశాల పరిష్కారం ఆలస్యమైందని చెప్పారు.
ఉద్యోగుల సమస్యలు దశలవారీగా సమస్యల పరిష్కారం..: బుగ్గన
ప్రభుత్వం అనేది ఓ కుటుంబం, ఉద్యోగులు కూడా అందుబాలో భాగమేనని బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలు త్వరలోనే పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. దశలవారీగా వారిచ్చిన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
డిమాండ్ల పరిష్కారానికి మంత్రి బుగ్గన హామీ
వచ్చే బుధవారం సీఎస్ సమీర్ శర్మతో కూడిన కార్యదర్శుల కమిటీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. తానే స్వయంగా పర్యవేక్షిస్తానని బుగ్గన తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై 9 సంఘాలు ఉద్యమం చేస్తున్నాయని, వారిని విరమించాలని ప్రభుత్వం తరపున కోరుతున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. డిమాండ్ల పరిష్కారానికి హామి ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం వేర్వేరుగా చర్చలు జరిపింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పీఆర్సీ సహా ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన 71 అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
ఉద్యోగుల ఉద్యమం తాత్కాలిక వాయిదా
అనంతరం ఉద్యోగా సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లను మరోమారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, ఏపీ సచివాలయానికి సంబందించిన 11 అంశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 85 అంశాలు నివేదించామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. సచివాలయంలో అదనపు పోస్టులను భర్తీ చేయాలని కోరినట్లు చెప్పారు. అసెంబ్లీ ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జిల్లాల్లో ఉద్యోగులకు స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. మరో నేత బొప్పరాజు మాట్లాడుతూ.. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు 71 అంశాలపై కూలంకషంగా చర్చించామని, ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పిందన్నారు. ప్రభుత్వ హామీతో ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు పీఆర్సీ కోసం నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే.