‘మగధీర’ సినిమా చేయనన్న హీరోతో రాజమౌళి తర్వాత సినిమా ఫిక్స్
తెలుగు సినిమా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి స్థానం ప్రత్యేకం. ఒకప్పుడు ప్రాంతీయ ప్రాజెక్ట్గా ముద్రపడిన టాలీవుడ్ను బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు నిలబెట్టిన ఘనత ఈయనదే. పోస్టర్పై కథానాయకుడు ఎవరనేది పక్కన పెడితే, 'జక్కన్న కాంబినేషన్' అనే ఒక్క మాటతోనే థియేటర్లు హౌస్ఫుల్ అయ్యేంత క్రేజ్ సొంతం చేసుకున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్లతో గ్లోబల్ స్థాయిలో రికార్డులను తిరగరాసిన ఈ దర్శకధీరుడు, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వేల కోట్ల బడ్జెట్తో 'వారణాసి' అనే భారీ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
తర్వాత సూర్యతోనే
అయితే, ఈ విజువల్ వండర్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోందనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. గతంలో రామ్ చరణ్తో మరో కాంబో వస్తుందనే వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా ఫిలింనగర్ వర్గాల నుంచి సంచలన సమాచారం బయటకు వచ్చింది. ఈసారి టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన కోలీవుడ్ స్టార్ సూర్యతో జతకట్టబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన గతం ఉంది.

'మగధీర' కథను జక్కన్న మొదట సూర్యకే వినిపించారనే విషయం చాలామందికి తెలియదు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఒక సినీ వేదికపై దర్శకుడు ఈ విషయాన్ని సరదాగా గుర్తుచేసుకోగా, సూర్య నవ్వుతూ "అప్పుడు తెలియక చేసిన పొరపాటు, ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్" అని వేడుకున్న సందర్భం ఉంది. ఇప్పుడు ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోందని తెలుస్తోంది.
సాదాసీదాగా.. సింపుల్ గా
అన్నింటికంటే పెద్ద మాస్ ట్విస్ట్ ఏమిటంటే- భారీ విజువల్ ఎఫెక్ట్స్, వందల కోట్ల బడ్జెట్, సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూళ్లకు కాస్త విరామం ఇవ్వాలని టీమ్ భావిస్తోందట. 'మర్యాద రామన్న' తరహాలో అత్యంత సరళంగా, భావోద్వేగాలు, వినోదానికి ప్రాధాన్యమిస్తూ ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను పట్టాలెక్కించే యోచనలో ఉన్నట్లు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే!














Click it and Unblock the Notifications