జనం నవ్వుతారు: కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై మంత్రి అమర్నాథ్ రెడ్డి హాట్ కామెంట్స్
అమరావతి: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న ప్రతిపాదన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఈ విషయం సంచలనంగా మారింది.
భూస్థాపితం చేసిన పార్టీతో పొత్తా..?: మంత్రి గుడివాడ అమర్నాథ్
ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై అధికార వైసీపీ నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ విషయంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిన పార్టీనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పొలిటికల్ స్ట్రాటజిస్టులు సలహాలు ఇస్తారని.. అయితే, వాటిని అమలు చేయాలో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం పార్టీ అధినేతలదేనని అమర్నాథ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, సోనియాను ఎదిరిగించి నిలబడ్డ మొగోడు జగనే: అమర్నాథ్
కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఎదిరించి నిలబడ్డ మొగోడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డినేనని అన్నారు గుడివాడ అమర్నాథ్. 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం వెతుక్కునే స్థాయికి దిగజార్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తంటే ప్రజలు నవ్వుతారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. మరో వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి కూడా పొత్తు అంశంపై స్పందించారు. ఏపీకి మేలు చేసే పార్టీతోనే పొత్తు ఉంటుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్లోకి ప్రశాంత్ కిషోర్.. ఏపీలో పూర్వ వైభవం కోసం
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ పనిచేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ పార్టీ విజయం సాధించడంలో ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించారు. అయితే, తాజాగా, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలుమార్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆయన కలిశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనేపథ్యంలోనే ఆ పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ప్రశాంత్ కిషోర్ ఎంట్రీకి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటే సానుకూల ఫలితాలుంటాయని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పెద్దలకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? అని వైసీపీ నేతలు అంటున్నారు. పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదని తేల్చి చెబుతున్నారు.