బీసీలకు ఏం చేశారో చర్చించేందుకు సిద్దమా?: కాలువ
బీసీలపై పాదయాత్ర సందర్భంగా వైసీపీ చీఫ్ జగన్కు ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారని ఏపీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. తన తండ్రి వైఎస్ఆర్ కాలంలో బీసీలను రాజకీయంగా అణగదొక్కిన విషయాన్ని పాదయాత్రలో
అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్పై ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వం బీసీల పట్ల ఎంతో బాధ్యతగా ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్లే బీసీలకు ప్రత్యేక ఉప ప్రణాళికను అమలు చేస్తోందని అన్నారు.జగన్కు పాదయాత్ర సందర్భంగా బీసీపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చిందని ఆయన ఆరోపించారు.
ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చేనెల 2 నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.బీసీ సామాజిక వర్గ ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సోమవారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బీసీ సంఘాలతో సమావేశమయ్యారు.. ఈ నేపథ్యంలో జగన్ తీరుపై ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఫైర్ అయ్యారు.
జగన్కు తాను ఒకటే సవాల్ చేస్తున్నాని, జగన్ తండ్రి పాలించిన కాలంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో బీసీలకు కేటాయిచింది ఎంతో, ఖర్చుపెట్టింది ఎంతో చెప్పాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.. అలాగే బీసీల అభివృద్ధి కోసం చేసిన కృషి ఏంటో తెలపాలని నిలదీశారు. ఈ విషయాలపై చర్చించడానికి సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు
టీడీపీ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన దాంట్లో వైఎస్సార్ ప్రభుత్వం సగమైనా చేయలేదని అన్నారు. జగన్ పార్టీ నేతలు వైఎస్సార్ పాలన మళ్లీ తీసుకొస్తామని చెప్పుకుంటున్నారని, అటువంటి పాలన ప్రజలకు కావాలా? అని కాలువ శ్రీనివాసులు ప్రశ్నించారు.
వైఎస్సార్ పాలన గురించి ప్రతి బీసీ విద్యార్థికి అర్థమయ్యేలా చెబుతామని జగన్ అంటున్నారని, మరి 'వైఎస్సార్ పాలనలో బీసీలను రాజకీయంగా అణగదొక్కామని ప్రజలకు చెబుతారా? వైఎస్సార్ బీసీల వ్యతిరేకమని చెబుతారా? ఆయన పాలనలో బీసీ విద్యార్థులు రక్తం అమ్ముకుని ఫీజులు కట్టుకున్నారని చెబుతారా?' అని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు.