ఎడ్ల బండిపై మంత్రి రోజా సందడి: నారాసురిడి సంహారం అంటూ సంచలనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ మంత్రి రోజా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె తూర్పుగోదావరి జిల్లా తణుకులో జరిగిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి రోజా హాజరయ్యారు. మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఎడ్ల బండి తోలుతూ మంత్రి రోజా సందడి
ఎడ్ల బండిని తోలుతూ మంత్రి రోజా ఉత్సాహం నింపారు. ప్రస్తుతం రోజా ఎడ్ల బండిని తోలిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారాయి. మన సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు తెలియజేసేలా ఈ ఎడ్ల బలప్రదర్శన పోటీలను మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నిర్వహించడం చాలా అభినందనీయమని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.
మూడేళ్ల క్రితం నారాసురుడి సంహారం అంటూ రోజా
ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శల దాడి చేశారు రోజా. నరకాసురుడిని సంహరించినందుకు దసరా శరన్నవరాత్రులు జరుపుకుంటామని.. మూడేళ్ల క్రితం జగనన్న మన రాష్ట్రంలో నారాసురిడిని సీఎం జగన్ సంహరించారని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కుప్పం వెళితే.. నారా లోకేష్ కలుగులో ఎలుకలా దాక్కున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నకిలీ పోరాటమంటూ రాజధానులపై రోజా
రాష్ట్రానికి మూడు రాజధానులకు మద్దతుగా ప్రజలందరూ విజయదశమి రోజు ఆలయాలకు వెళ్లి పూజలు చేయాలని మంత్రి రోజా పిలుపునిచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రమంతటా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ యోచిస్తుంటే.. తన బినామీలను కాపాడుకోవడానికే 29 గ్రామాల కోసం చంద్రబాబు నకిలీ పోరాటం చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు.
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు లాంటి సైకోలను జనం రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రోజా ధ్వజమెత్తారు.