కమరావతి ఇవాళ అమరావతైంది-చంద్రబాబు పోయినా-మంత్రి అప్పలరాజు కామెంట్స్..
ఏపీ రాజధాని అమరావతిలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరు ఇవాళ భారీ టర్న్ తీసుకుంది. అమరావతిలో వైసీపీ సర్కార్ పై ఉన్న వ్యతిరేకత అధిగమించే క్రమంలో పేదలకు ఇళ్ల స్ధలాల్ని పంపిణీ చేయాలని నిర్ణయించిన వైసీపీ సర్కార్.. ఎన్నిఅడ్డంకులు ఎదురైనా అధిగమించి ఇవాళ అనుకున్నది చేసేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ రాజధాని అమరావతిని ఇన్నాళ్లు కమ్మ సామాజిక వర్గం వారు ఆక్రమించారని ఆరోపిస్తున్న వైసీపీ సర్కార్ లో మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజు.. ఇదే అంశంపై ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు అది అమరావతి కాదు కమరావతి అన్నారు. ఇప్పుడు అది నిజమైన అమరావతి అయిందన్నారు. అమరావతి లో ఇళ్ళ స్థలాలు ఇస్తాను అంటే ప్రతిపక్షాలు ఎన్నో ఎత్తులు వేశారు, చంద్రబాబు ఎన్నో కుట్రలు పన్నారని అప్పలరాజు ఆరోపించారు.

పేదలకు అమరావతిలో ఇళ్ళ స్థలాలు ఇస్తాను అంటే కోర్టులో వేస్తారని, పేదల పట్ల చంద్రబాబుకు గౌరవం లేదని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. సెంటు భూమిపై శవాలను పూడ్చడం తప్ప ఇంక దేనికీ సరిపోదు అంటూ హేళన చేశారన్నారు.నువ్వు పోయాక కూడా ఆ సెంటు స్థలంలోనే పుడ్చాలి గుర్తుపెట్టుకో అంటూ చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు సిగ్గు లజ్జా ఉంటే నువ్వు ఎన్ని ఎకరాలు పేదలకు పంచి పెట్టవు చెప్పగలవా అని అప్పలరాజు ప్రశ్నించారు.
అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి కావడంతో ప్రభుత్వం ఇప్పుడు వాటిలో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ మొదలుపెట్టబోతున్నట్లు సీఎం జగన్ ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసిన సభలోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ మరింత ముదిరే అవకాశముంది.












Click it and Unblock the Notifications