2వ దశలోనూ వైసీపీ ప్రభంజనం -చంద్రబాబుకు మతిభ్రమణం -మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ -3పై నిమ్మగడ్డ నిఘా
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి, ఎన్నికల కమిషనర్కు మధ్య రోజుకో వివాదం తెత్తుతున్నప్పటికీ, ప్రక్రియ మాత్రం సజావుగా సాగిపోతూనే ఉంది. మొత్తం నాలుగు దశల ఎన్నికలకుగానూ, శనివారం రెండో దశ పోలింగ్ ముగియగా, ఆదివారం మధ్యాహ్నం నాటికి ఫలితాలు కూడా వెలువడ్డాయి. తొలి దశ లాగే రెండో ఫేజ్ లోనూ అధికార వైసీపీ బలపర్చిన అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. టీడీపీ మాత్రం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తప్పుడు దారిలో విజయమూ ఓ గెలుపేనా? అని విమర్శించింది. ఆ విమర్శలకు సమాధానమిస్తూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు -ఇంటి పైకప్పు తొలగించి బీభత్సం -8రోజుల పసికందు మృతి
ఇవీ ఫలితాలు..
ఎస్ఈసీ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఏపీలో 3,249 పంచాయితీలకు తొలి దశలో, 3,328 పంచాయితీలకు రెండో దశలో పోలింగ్ పూర్తయింది. తొలి దశ ఫలితాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు 2640 స్థానాలు, టీడీపీ 509, బీజేపీ-జనసేన 46, ఇతరులు 54 స్థానాలను కైవసంచేసుకున్నారు. ఇక తాజాగా వెలువడిన రెండో దశ ఫలితాల్లో వైసీపీ 2471 స్థానాలు, టీడీపీ 523, బీజేపీ-జనసేన 45, ఇతరులు 90 స్థానాలను గెలుచుకున్నారు. పంచాయతీ ఫైట్లో తమ మద్దతుదారులే ప్రభంజనం సృష్టిస్తున్నారని అధికార వైసీపీ చెబుతుండగా, రెండో విడత ఎన్నికల్లో తమ మద్దతు దారులు 40 శాతం మంది గెలిచారని టీడీపీ క్లెయిమ్ చేసుకుంది. పుంగనూరు, తంబల్లపల్లి, మాచర్లలో ఎన్నికలు నిలిపేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేయడంపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో స్పందించారు..
ఎన్నికల అక్రమాలపై హైకోర్టులో పిటిషన్
పుంగనూరు, తంబల్లపల్లి, మాచర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన చంద్రబాబు.. వాటికి సంబంధించి ఫిర్యాదులు చేసినాకూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పట్టించుకోలేదని వాపోయారు. ఎన్నికలు ఐపోతే చాలని నిమ్మగడ్డ భావిస్తున్నారని, ఆ క్రమంలో నిబంధనలను సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. పుంగనూరు, తంబల్లపల్లి, మాచర్లలో ఎన్నికలు నిలిపివేసి.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆ మూడు ఏరియాల్లో కేంద్ర బలగాలతో మూడు చోట్ల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. మాచర్ల లో 77 పంచాయతీలుంటే ఏకంగా 76 ఏకగ్రీవాలు చేశారని, ఏపీలో పంచాయతీ ఎన్నికల తీరుపై హైకోర్టులో పిల్ వేశామని చంద్రబాబు చెప్పారు. ఈ పిటిషన్ పై ఈ వారమే విచారణ జరుగనుందని తెలిపారు. అయితే..
చంద్రబాబుకు మతిభ్రమించింది..
ఎన్నికల్లో గెలిచే దమ్ము, ధైర్యం టీడీపీకి లేదని పంచాయతీ రాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు దశల పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని చూశాక చంద్రబాబు సహా టీడీపీ నేతలకు మతిభ్రమించినట్లయిందన్నారు. మూడు, నాలుగో విడతల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పుంగనూరు, తంబల్లపల్లి, మాచర్లలో ఎన్నికలు నిలిపేయాలని చంద్రబాబు కోరడం మతిలేని చర్య అని, ఎన్నికల్లో గెలవలేక టీడీపీ కోర్టుల్లో కేసులు వేస్తోందని మంత్రి అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలని పెద్దిరెడ్డి సవాలు విసిరారు.
కుంభకర్ణుడు కన్నా ఎక్కువ..
పంచాయితీ ఎన్నికలు పూర్తయిన వెంటనే మున్సిపల్, కార్పొరేషన్, జెడ్పీ, ఎంపీటీలకు కూడా ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ సిద్ధం అవుతున్నారన్న వార్తల నడుమ.. ఎన్నికలు ఏవైనా గెలిచేది వైసీపీనే అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మరో పార్టీ లేకుండా ప్రజలు తీర్పు చెప్పారని, పంచాయతీ ఎన్నికల్లాగే, జెడ్పీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని, విజయవాడలోని 64 డివిజన్లునూ వైసీపీనే గెలుచుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుంభకర్ణుడు కన్నా ఎక్కువ అని, నిధులు తేలేని అసమర్థుడు నాని అని, ఈసారి టీడీపీ మేయర్ పీఠం అంచులకు కూడా రాలేదని మంత్రి శ్రీనివాస్ అన్నారు. కాగా
మూడో దశపై నిమ్మగడ్డ గట్టి నిఘా
తొలి రెండు దశల్లో వైసీపీ మద్దతు దారులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. మూడో దశ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలపై గట్టి నిఘా పెడుతున్నామని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. సాధారణ ఎన్నికల స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు బందోబస్తు ఏర్పాటు చేశారని, ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే పోలింగ్ శాతం భారీగా పెరిగిందన్న ఎస్ఈసీ.. మూడో దశ ఎన్నికల్లో కూడా ప్రజలు స్వేచ్చంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Pulwama Terror Attack: రెండేళ్లు -NIA విఫలం -Interpol ఎంట్రీ -అమర జవాన్లకు కిసాన్ల నివాళి