'వైఎస్ఆర్ ఫోటో పెట్టుకొనే హక్కు జగన్ పార్టీకి లేదు, వారిని వైసీపీ అవమానపర్చింది'
అమరావతి: స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాంతం ఆచరించిన సెక్యులర్ రాజకీయ మూల సిద్దాంతాలకు విరుద్దంగా వైఎస్ఆర్ సిపీ మతతత్వ శక్తులకు మద్దతిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. రాజకీయ అవకాశవాదంతో వ్యవహరించిన వైసీపీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకొనే అర్హత లేదని ఆయన విరుచుకుపడ్డారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ అభ్యర్థికి అనుకూలంగా వైసీపీ నిర్ణయం తీసుకొంది. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన వైసీపీ అధినేత జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ అభ్యర్థికి తమ పార్టీ మద్దతిస్తోందని ప్రకటించారు.
అంతేకాదు ఎన్ డి ఏ కు బలముంది.విపక్షాలు రాష్ట్రపతి పదవి కోసం పోటీకి నిలపడం కూడ సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో ఎన్ డి ఏ కు జగన్ మద్దతుగా నిలవడం పట్ల ఎన్టీయేతర పక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ మేరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ . రఘువీరారెడ్డి ఆదివారం నాడు వైసీపీ అధినేత జగన్ కు బహిరంగ లేఖ రాశారు.
వైసీపీ బిజెపికి దగ్గరౌతోందనే సంకేతాలను ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రాజకీయంగా వైసీపీని ఇరుకునపెట్టేందుకు ఇతర పార్టీలు కూడ తమ కార్యాచరణను సిద్దం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో పుంజుకొనేందుకు ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకొనే అర్హత లేదు
సెక్యులర్ రాజకీయాలపై విశ్వాసం ఉంచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను బతికున్నంత కాలం అవే రాజకీయాలను ఆచరించాడని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఈ విశ్వాసాలకు తిలోదకాలిచ్చిన వైసీపీ అధినేత జగన్ మతతత్వ బిజెపికి మద్దతివ్వడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహన్నివ్యక్తం చేశారు.వైఎస్ ఆశయాలకు విరుద్దంగా వ్యవహరించిన వైసీపీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకొనే అర్హత లేదన్నారు. వైసీపీ తీసుకొన్న రాజకీయ నిర్ణయమే ఇందుకు కారణమన్నారు రఘువీరారెడ్డి.
వారిని అవమానపర్చారు.
వైసీపీ అధినేత జగన్ కు ఏపీ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి బహిరంగ లేఖ రాశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు స్వంతంగా తమ అభ్యర్థిని గెలిపించుకొనే సత్తా లేదన్నారు. ప్రాంతీయ పార్టీలను ప్రలోభాలకు గురిచేసి మద్దతు కూడగట్టేందుకు బిజెపి అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ప్రత్యేక హోదా అమలును డిమాండ్ చేస్తూ షరతు విధిస్తే కనీసం రాష్ట్రానికైన మంచి జరుగుతోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సెక్యులర్ విధానాలను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఆందోళన కల్గించే రీతిలో వైసీపీ నిర్ణయాలు తీసుకొంటోందన్నారు. ఇది మీ పార్టీకి తగదన్నారు. దళితులు, మైనార్టీలు, ఇతర సెక్యులర్ శక్తులను అవమానపర్చడమే కాకుండా, వారికి ద్రోహం చేశారని రఘువీరారెడ్డి ఆరోపించారు.
సెక్యులర్ అంటూ సంఘ్ నేతకు మద్దతిస్తారా?
రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి ఎన్ డీ ఏ తరపున పోటీచేస్తున్న రామ్ నాథ్ కోవింద్ రాజకీయ జీవితం మనువాద భావజాలం పునాదిగా కలిగిన ఆర్ ఎస్ ఎస్ బిజెపితోనే మొదలైందన్నారు. గత మూడేళ్ళుగా బిజెపి నేతృత్వంలోని ఎన్ డి ఏ సర్కార్ హయంలో దళితులు, ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులకు ఏ సమాధానం చెబుతారని జగన్ ను రఘువీరా ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రయోజనాలకోసం మీరాకుమార్ కు మద్దతివ్వాలని వినతి
యూపిఏ అభ్యర్థి మీరాకుమార్ ను రాష్ట్రపతిగా ఎన్నుకొంటే సామాజిక న్యాయానికి, ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటుందని జగన్ కు రఘువీరా రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రపతిగా మీరాకుమార్ ను గెలిపించాలని జగన్ ను కోరారు రఘువీరారెడ్డి. అలా చేయకపోతే వైసీపీ చెబుతున్న లౌకికవాదానికి, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రపతిగా మీరాకుమార్ ను గెలిపించాలని జగన్ ను రఘువీరా కోరారు.