జేడీ లక్ష్మీనారాయణపై జగన్ ట్యాపింగ్ - మోదీకి రాస్తే డీజీపీ స్పందనా? - చంద్రబాబు సంచలనం
''ఫోన్ ట్యాపింగ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి నేను లేఖలు రాశాను. దానిపై కేంద్రం కంటే ముందే రాష్ట్ర డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉంది. కోర్టులో నిలబడి చట్టాలు చదవాల్సిన పరిస్థితులు డీజీపీ ఎందుకు తెచ్చుకున్నారు? అయినా, ఫోన్ ట్యాపింగ్స్ చేయడం వైసీపీకి ముందు నుంచీ అలవాటైన పనే. గతంలో జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు'' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్: ఢిల్లీలో విజయసాయిరెడ్డి లాబీయింగ్ - డీజీపీపైనా టీడీపీ విసుర్లు - గంటకో ట్విస్ట్..
చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. గంట గంటకూ కొత్త విషయాలు వెల్లడవుతూ థ్రిల్లర్ తరహాలో సాగిపోతున్నది. ప్రతిపక్ష పార్టీల నేతలు, జడ్జిలు, లాయర్లు, జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టుల ఫోన్లను జగన్ సర్కారు ట్యాపింగ్ చేస్తోందంటూ చంద్రబాబు లేఖ రాయగా.. అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలంటూ టీడీపీ అధినేతకు డీజీపీ గౌతం సవాంగ్ మరో లేఖ రాయడం తెలిసిందే. పలు జిల్లాల కీలక నేతలతో మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. కీలక అంశాలను చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్యాపింగ్ వ్యవహారంపై వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ డీజీపీ ఏం చేశారు?
ఫోన్ ట్యాపింగ్లపై ఆధారాలు కావాలంటోన్న డీజీపీ గౌతం సవాంగ్.. గతంలో పలు అంశాలపై, వైసీపీ సర్కారు అక్రమాలపై ఆధారాలతో సహా రాసిన లేఖలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇటీవల పలు సందర్భాల్లో కోర్టు మొట్టికాయలు వేసిన వైనాన్ని గుర్తుచేస్తూ.. ‘‘కోర్టులో నిలబడి చట్టం చదవాల్సిన పరిస్థితులు డీజీపీ ఎందుకు తెచ్చుకున్నారు?''అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. హోం మంత్రితో కలిసి సోమవారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన డీజీపీ.. చంద్రబాబు ఆరోపణల్ని ఖండించడం తెలిసిందే. అదే అంశంపై తాజాగా లేఖ కూడా రాశారు.
చంద్రబాబుకు మోదీ సర్కార్ ఝలక్? - ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ - అసలుకే ఎసరు?
డాక్టర్ల ఫోన్లనూ వదలట్లేదు..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్లను కూడా జగన్ ట్యాప్ చేయించారన్న చంద్రబాబు.. చివరికి డాక్టర్లు ఫోన్లను కూడా వైసీపీ వదలడంలేదని, రోగులు చేసే ఫోన్లకు జవాబివ్వాలంటేనే డాక్టర్లు భయపడే స్థితి నెలకొందని, సర్కారు వేధింపులు తట్టుకోలేకే చాలా మంది వైద్యం చేయడానికి మందుకురావట్లేదని ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. గడిచిన 15 నెలలుగా తప్పులను కొనసాగిస్తూనే ఉందని, ఉన్మాదంతో వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.