2023 : కొత్త ఏడాదిపై ఏపీ పార్టీల కోటి ఆశలు-జగన్, చంద్రబాబు, పవన్ కు డిసైడర్ ఇలా.. ?
ఏపీలో 2022 ఏడాదిని మిశ్రమ ఫలితాలతో ముగించిన రాజకీయ పార్టీలు.. కొత్త ఏడాదిని మాత్రం పాజిటివ్ నోట్ తో మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా కొత్త ఏడాదిలో ముందస్తు ఎన్నికలు తప్పవన్న అంచనాలతో ప్రధాన పార్టీల్లో హీట్ ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఇప్పటిదాకా చేసిన రాజకీయం ఓ ఎత్తు, ఇక చేయబోయే రాజకీయం మరో ఎత్తుగా మారిపోతోంది. దీంతో కొత్త ఏడాదిపై భారీ అంచనాలతో అడుగుపెడుతున్న రాజకీయ పార్టీలు.. ఇకపై ఏం చేయబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్, చంద్రబాబు, పవన్ అంచనాలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం..

2022లో ఏపీ పార్టీలకు మిశ్రమ ఫలితాలు
2022 ఏడాది ఏపీ రాజకీయ పార్టీలకు మిశ్రమ ఫలితాలు అందించింది. అధికార వైసీపీతో పాటు విపక్షంలోని టీడీపీ, జనసేన కూడా ఈ ఏడాది మిశ్రమ ఫలితాలతోనే ముగించాల్సి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగిన మూడేళ్లలో ఏకపక్షంగా సాగిన అధికారపార్టీ రాజకీయానికి ఈ ఏడాది మాత్రం కాస్త బ్రేకులు పడ్డాయి.
దీంతో వైసీపీ ప్రత్యామ్నాయ వ్యూహాల్లో తలమునకలై కనిపిస్తోంది. అదే సమయంలో ఈ ఏడాది గ్రాఫ్ ను బాగానే పెంచుకున్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జగన్ కు గట్టి పోటీదారులుగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో జగన్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలకు పదునుపెట్టాల్సిన పరిస్దితి. దీంతో ముందస్తు ఎన్నికల ప్రచారం కూడా మరోసారి తెరపైకి వచ్చేసింది.

2023పై భారీ అంచనాలు
కొత్త ఏడాది 2023పై ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేనతో పాటు అన్ని పార్టీలు కూడా భారీ అంచనాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో కొత్త ఏడాది తమకు కచ్చితంగా టర్నింగ్ పాయింట్ ఇవ్వబోతున్నట్లు ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా విపక్షాలపై ఈ ఏడాది పైచేయి సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేసేందుకు జగన్ సిద్దమవుతుండగా.. విపక్షాల ఐక్యత కోసం పవన్, పొత్తులున్నా లేకపోయినా సత్తా చాటుకోవాలనే ప్రయత్నాల్లో చంద్రబాబు కనిపిస్తున్నారు. దీంతో కొత్త ఏడాదిలో వీరు సాగించే రాజకీయాలు ఎన్నికల అజెండాను సైతం నిర్దేశించబోతున్నాయి.

జగన్ కు మరో ఛాన్స్?
ఈ ఏడాదితో పోలిస్తే 2023లో భారీగా బలపడేందుకు వైఎస్ జగన్ కొత్త వ్యూహాలకు తెరదీస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది బడ్జెట్ చాలా కీలకంగా మారబోతోంది. ఇప్పటివరకూ సంక్షేమంపైనే ఎక్కువగా దృష్టిపెట్టిన జగన్, చివరి ఏడాదిలో అభివృద్ధిపై దృష్టి పెట్టి విపక్షాలకు గట్టి జవాబు ఇస్తారా లేక ఈసారీ సంక్షేమాన్నే నమ్ముకుని ఎన్నికలకు వెళ్లబోతున్నారా అన్నది తేలిపోనుంది. ఏప్రిల్ తర్వాత అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న అంచనాల నేపథ్యంలో కొత్త ఏడాది జగన్ కు చాలా కీలకంగా మారబోతోంది. ఇప్పటివరకూ భారీ ఎత్తున సంక్షేమం అమలు చేసినా దాని ఫలితాలు పూర్తిస్ధాయిలో అందుకోలేకపోయామన్న ఆందోళనలో జగన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. దీంతో కొత్త ఏడాదిలో మరిన్ని పథకాలు తెరపైకి రావొచ్చంటున్నారు. అలాగే ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ముందస్తుకు వెళితే ఏం జరగబోతోందన్నది జగన్ కు కీలకం.

చంద్రబాబు పొత్తు వ్యూహాలు?
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా మూడున్నరేళ్లుగా పోరాడుతున్న చంద్రబాబు.. గత ఆరునెలల్లో తన గ్రాఫ్ ను కాస్త పెంచుకోగలిగారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో రాష్ట్రంలో చంద్రబాబు గ్రాఫ్ కాస్త పెరిగింది. ఏపీ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా చంద్రబాబు అవసరం పెరుగుతోంది.
అదే సమయంలో పొత్తులతో ముందుకెళితేనే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న చంద్రబాబు.. బీజేపీ, జనసేనతో బేరాలాడుతున్నారు. అయితే తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఏపీలో చంద్రబాబు అవకాశాలు మరింత మెరుగుపడటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే జనసేనతో పొత్తు కుదిరితే చాలా అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్ధుల అవకాశాలు మెరుగుపడతాయనే అంచనా ఉంది.

పవన్ కళ్యాణ్ రాజకీయమే టర్నింగ్?
ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కంటే కూడా మూడో స్ధానంలో ఉన్న జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది కీలకంగా మారిపోయారు. కేంద్రంలో అధికార బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీతో కలిసి పోరాటాలు చేయడం లేదు. అలాగే సొంతంగా బలం పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది అటు జగన్ , ఇటు చంద్రబాబు అవకాశాల్ని ప్రభావితం చేయబోతోంది.
పవన్ తో పొత్తు కోసం ఓవైపు బీజేపీ, మరోవైపు చంద్రబాబు తహతహలాడుతున్నారు. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేస్తానని పదే పదే చెబుతున్న పవన్ అందులో సక్సెస్ అయితే మాత్రం రాష్ట్రంలో రాజకీయాలకు ఇదో టర్నింగ్ పాయింట్ గా మారడం ఖాయం. కొత్త ఏడాదిలో ఈ మేరకు పవన్ తీవ్రంగా ప్రయత్నించే అవకాశముంది.












Click it and Unblock the Notifications