ఏపీలో 2014 పొత్తులు రిపీట్, మరి ఫలితం : అక్కడే అసలు ట్విస్ట్..!!
ఏపీలో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే జగన్ ఓటమి లక్ష్యంగా పొత్తు ప్రకటించాయి. కొంత కాలంగా బీజేపీ వైఖరి పైన కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర పడనుంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలతో బీజేపీ వైఖరి పైన క్లారిటీ రానుంది. 2014 తరహాలో మూడు పార్టీలు కూటమిగా పోటీ పై ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. నాడు - నేడు జగన్ ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. మరి ఫలితం ఏంటి. అధికారం దక్కించుకొనేదెవరు.
పొత్తులు రిపీట్: పదేళ్ల కాలం తరువాత ఏపీలో 2014 రాజకీయం రిపీట్ అవుతోంది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసాయి. నాటి మోదీ ఛరిష్మా, పవన్ మద్దతు, రాష్ట్రంలో నాటి పరిస్థితులు చంద్రబాబుకు కలిసి వచ్చాయి. టీడీపీ అధికారం చేపట్టింది. నాడు జగన్ సింగిల్ గానే పోటీ చేసారు. నాడు చంద్రబాబు భారీ హామీలు ఇచ్చారు. రుణమాఫీ బాగా ప్రభావం చూపింది.

102 సీట్లు, బీజేపీ 4, ఒకరు స్వతంత్ర అభ్యర్ది గెలవగా, వైసీపీ 67 స్థానాల్లో విజయం సాధించింది. జగన్ ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యారు. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చాయి. జగన్ సుదీర్ఘ పాదయాత్రతో చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించిన విధానం ప్రజలకు వివరించి 151 సీట్లతో 2019లో విజయం సాధించారు.
జగన్ నాడు - నేడు: ఇప్పుడు తిరిగి 2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోరాటం చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనూ జగన్ తిరిగి ఒంటరిగా పోటీకి సిద్దమయ్యారు. 2014 పొత్తులతో పాటుగా ఫలితం కూడా రిపీట్ అవుతుందని ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ, నాడు - నేడు పొత్తుల లెక్కలు..సమీకరణాల్లో స్పష్టమైన మార్పు ఉంది. నాడు జనసేన పోటీ చేయలేదు. ఇప్పుడు బీజేపీతో పాటుగా జనసేన బరిలో ఉంటుంది.
రెండు పార్టీలకు టీడీపీ 40 స్థానాలకు పైగా కేటాయించాల్సి ఉంటుంది. ఈ సీట్లు కోల్పోవటం టీడీపీలో ఆశావాహుల పైన ప్రభావం చూపించటం ఖాయం. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు మంత్రాంగం ప్రారంభమైంది. సీట్లు సర్దుబాటు చేసుకుంటూ..క్షేత్ర స్థాయిలో మూడు పార్టీల కేడర్ ను కలిపి ఎన్నికల్లోకి వెళ్లటం చంద్రబాబుకు బిగ్ టాస్క్.

ఫలితం పై ఉత్కంఠ: అదే సమయంలో సీట్లు దక్కని పార్టీ నేతలను బుజ్జగించటం మరో కష్టమైన పని. అటు జగన్ సింగిల్ గా పోటీ చేస్తున్నారు. జగన్ తాను అమలు చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం తనకు కలిసి వస్తాయని నమ్ముతున్నారు. జగన్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ సీట్ల ఎంపిక పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు రెండు పార్టీలతో పొత్తుల వేళ చంద్రబాబుకు సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్ల ఎంపికకు వెసులుబాటు తక్కువ.
ఏపీలో ఇప్పుడు ఎన్నికల ఫలితాలను సామాజిక సమీకరణాలే ప్రభావితం చేయనున్నాయి. ఇక, గతంలో ఎన్డీఏ నుంచి ఏ కారణాలతో చంద్రబాబు బయటకు వెళ్లారో..ఇప్పటికీ ఆ హామీలు అమలు కాలేదు. తిరిగి ఎన్డీఏలో చేరే సమయంలో చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల వేళ..పొత్తులు 2014 తరహాలో రిపీట్ అయినా... ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications