వైసీపీ ఎంపీల రాజీనామా : జగన్ నయా స్ట్రాటజీ - వైసీపీలో ఏం జరుగుతోంది..!!
సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు. ఏపీలో ఇప్పుడు 2019 ఎన్నికల ముందు సీన్ రిపీట్ అవుతోంది. నాడు ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా రాజీనామా చేద్దామంటూ నాటి విపక్ష నేత హోదాలో జగన్ డిమాండ్. ఇప్పుడు పోలవరం నిధుల కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ చంద్రబాబు కొత్త డిమాండ్. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే పోలవరం నిధులు ఎందుకు రావో చూస్తానంటూ సవాల్. టీడీపీ ఎమ్మెల్యేల తో రాజీనామా చేయించాలంటూ వైసీపీ నేతల కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారు. అదే సమయంలో సీఎం జగన్ కొత్త వ్యూహాలతో ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

పోలవరం పై జగన్ ను కార్నర్ చేస్తూ
పోలవరం నిర్వాసితులను పరామర్శ సమయంలో సీఎం జగన్..కేంద్రం తో నిధుల కోసం కుస్తీ పడుతున్నామని చెప్పారు. ప్రధానితో కలిసిన సమయంలో తాను నాలుగైదు సార్లు అడిగానని.. మంత్రులు ప్రతీ నెలా కోరుతున్నారని చెప్పుకొచ్చారు. త్వరలో మరోసారి ప్రధానితో సమావేశమైన సమయంలో నిర్వాసితులు..మిమ్మల్నే తిట్టుకుంటున్నారనే విషయాన్ని చెబుతానంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైనే టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆ సమయంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. 2019 ఎన్నికల ముందే వైసీపీ ఎంపీలు రాజీనామా చేసారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయలేదు. తన పార్టీ ఎంపీల రాజీనామా అంశాన్ని నాడు జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లి..సానుభూతి -మద్దతు సంపాదించారు.

2019 నాటి పరిస్థితులే..అంశాల్లోనే మార్పు
ఇప్పుడు 2024 ఎన్నికల వ్యూహాల్లో భాగంగా.. ఇప్పుడు చంద్రబాబు తన వ్యూహాలను పదును పెడుతున్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయమని డిమాండ్ చేయటం ద్వారా.. పరోక్షంగా వైసీపీ - కేంద్రం మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుందనేది ఒక అంచనా. ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంలో బీజేపీ పోలవరం విషయంలో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.
కానీ, చంద్రబాబు డిమాండ్ ను వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. అదే సమయంలో రాజీనామా చేయమని మాత్రం చెప్పటం లేదు. ఎప్పుడు రాజీనామా చేయాలో.. తమకు బాగా తెలుసంటూ మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతోనూ రాజీనామా చేయించాలని డిమాండ్ చేసారు. 2019 ఎన్నికల సమయంలో తాము వేసిన ట్రాప్ ఇప్పుడు చంద్రబాబు తమ పైన ప్రయోగిస్తున్నారనేది వైసీపీ ముఖ్య నేతల అంతర్గత చర్చల్లో వినిపిస్తున్న అభిప్రాయం. చంద్రబాబు వరద ప్రాంతాల్లో చేసిన విమర్శల పైన కాకినాడ కాపు నేస్తం సభలో స్పందించిన సీఎం జగన్..రాజీనామా డిమాండ్ పైన స్పందించ లేదు.

సీఎం జగన్ వర్సస్ చంద్రబాబు.. కొత్త వ్యూహాలతో
పోలవరం విషయంలో కేంద్రం చేస్తున్న తాత్సారం పైన సీఎం జగన్ సైతం అసహనంతో ఉన్నట్లుగా తాజాగా ముంపు ప్రాంతాల్లో పర్యటన సమయంలోనే స్పష్టమైంది. కానీ, తాము కేంద్రం పైన ఒత్తిడి పెంచేందుకు తీసుకొనే నిర్ణయాలతో చంద్రబాబుకు ప్రయోజనం కలగకూడదనేది వైసీపీ ఆలోచనగా తెలుస్తోంది.
దీంతో..సీఎం జగన్ వచ్చే వారం ఢిల్లీ పర్యటన సమయంలో పోలవరం సవరించిన అంచనాల ఆమోదం.. పునారావాస ప్యాకేజీ పైన కేంద్రంతో క్లారిటీ తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నట్లుగా సమాచారం. ఆ తరువాతనే రాజకీయంగా కీలక నిర్ణయాలు ఉంటాయనే చర్చ పార్టీలో జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటకం చేతకాకుంటే పాలన నుంచి తప్పుకోవాలని..తాను చేసి చూపిస్తానంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సైతం వైసీపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నాయి.
దీంతో..సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తరువాత పోలవరం వ్యవహారంలో వచ్చే నెలఖారులో జరిగే శాసనసభా సమావేశాల వేదికగా కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు పోలవరం విషయంలో సీఎం జగన్ వర్సస్ చంద్రబాబు రాజకీయం రాష్ట్రంలో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications