'వదల బొమ్మాళీ' అంటున్న బంగాళాఖాతం!
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు జోరుగా ఉండటంతో వీటి ప్రభావం మధ్యప్రదేశ్ పై ఉంది. అక్కడి నుంచి ఏపీ, తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. నాలుగోతేదీ సాయంత్రం తర్వాత హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏపీలోని రాయలసీమలో కూడా మోస్తరు వానలు పడతాయి.
నాలుగోతేదీ రాత్రిలోగా కోస్తా, ఉత్తరాంధ్రలో జల్లులు పడతాయి. తెలంగాణలో గంటకు పది కిలోమీటర్ల వేగంతో, ఏపీలో 15 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అయితే ఉష్ణోగ్రత పరంగా తెలంగాణలో 34 డిగ్రీలుగా ఉంటే ఏపీలో 36 డిగ్రీలు నమోదవుతోంది. ఓవైపు వర్షాలు కురిసే వాతావరణం, మరోవైపు వేసవికాలం తరహాలో ఎండలు మండిపోతున్నాయి. మొత్తంగా ఏపీలోని అధిక ప్రాంతం వేడిగానే ఉంది. గాలిలో తేమ శాతం మాత్రం ఏపీలో సగటున 70 శాతానికి మించి, తెలంగాణలో 80 శాతానికి మించి ఉంటుంది. రాత్రి గడిచేకొద్దీ తేమ పెరిగే అవకాశం ఉంది. ఈ వారం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది.

ఇటీవల కురిసిన వర్షాలకు, వాటివల్ల వచ్చిన వరదలకు ఏపీ, తెలంగాణ తీవ్రంగా నష్టపోయాయి. తెలంగాణలో మున్నేరు ఖమ్మం పట్టణాన్ని మంచేయగా, ఏపీలో బుడమేరు విజయవాడ నగరాన్ని ముంచేసింది. వరద బాధితులను ఆదుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలకు వివిధ రంగాల్లోని ప్రముఖులు భారీ విరాళాలను ప్రకటించారు.












Click it and Unblock the Notifications