AP RERA: ఏపీలో రియల్టర్లకు రెరా బంపర్ ఆఫర్..! 50 శాతం డిస్కౌంట్..!
ఏపీలో స్తిరాస్తి రంగాన్ని పరుగులు తీయించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేందుకు వీలుగా పలు రాయితీలు కూడా ఇప్పటికే ఇచ్చింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ అథారిటీ (రెరా) కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా రాష్ట్రంలో రెరా అనుమతి లేకుండా ప్రారంభించి కొనసాగిస్తున్న ప్రాజెక్టులతో పాటు త్రైమాసిక పురోగతి నివేదికలు సమర్పించని బిల్డర్లకు ఈ ఆఫర్ ఇచ్చింది.
రెరా చట్టం ప్రకారం ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ప్రారంభిస్తే దాన్ని కచ్చితంగా రెరా వద్ద నమోదు చేసుకోవాలి. అలాగే ప్రతీ ప్రాజెక్టు ప్రతీ మూడు నెలలకోసారి తమ త్రైమాసిక పురోగతి నివేదికలు(క్యూపీఆర్)ను కూడా రెరాకు సమర్పించాలి. ఈ రెండింటిలో ఏది చేయకపోయినా రెరా చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తారు. ఇలా విధిస్తున్న జరిమానాల విషయంలో రెరా స్తిరాస్తి వ్యాపారులకు ఓ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆర్దిక సంవత్సరం ముగింపు లోపు అంటే మార్చి 31లోపు ఈ జరిమానాలు చెల్లిస్తే అందులో 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు రెరా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లేదు. అలా చేయించుకున్న ప్రాజెక్టుల్లోనూ మూడో వంతు త్రైమాసిక పురోగతి నివేదికలు సమర్పించడం లేదు. ఇది రెరా చట్టం ప్రకారం జరిమానా విధించదగిన నేరం. కాబట్టి వీటిపై విధించే జరిమానాలు ఏదో ఒక రోజు చెల్లించక తప్పదు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం మార్చి 31లోపు జరిమానాల చెల్లింపులు చేసే వారికి 50 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే నిర్ణీత సమయంలోగా జరిమానాలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తప్పవని రెరా ఛైర్మన్ శివారెడ్డి హెచ్చరించారు.

మార్చి 31లోగా రెరా రిజిస్ట్రేషన్ చేయించుకోని ప్రాజెక్టులకు జరిమానాల చెల్లింపుకు నోటీసులు ఇవ్వబోతున్నారు. అప్పటికీ చెల్లించని వారిపై మొత్తం ప్రాజెక్టు విలువలో 10 శాతం జరిమానాగా విధిస్తారు. దీంతో పాటు సదరు ప్రాజెక్టుల్లో ప్లాట్లు అమ్ముకోకుండా, వాటిపై ప్రచారాలు చేసుకోవడానికి వీల్లేకుండా నిషేధం సైతం విధిస్తారు. దీంతో పాటు స్తిరాస్తి వ్యాపారుల్లో అవగాహన పెంచేందుకు త్వరలో సదస్సులు నిర్వహించాలని రెరా నిర్ణయించింది.












Click it and Unblock the Notifications