ఎపి రాజధాని: అంత సులువు కాదు, వచ్చే ఏడాదిలో..!
హైదరాబాద్: కోస్తా జిల్లాల్లో 'రాజధాని'పై జోరుగా చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని వస్తుందని సంకేతాలు ఇచ్చారు. అలాగే కేంద్రమంత్రి వెంకయ్యన ాయుడుకూడా పరోక్షంగా చెప్పారు. అయితే, రాజధానిగా ఎంపిక చేసిన ప్రదేశాన్ని అధికారికంగా ప్రకటించడానికి మరో మూడు నెలల వ్యవధి పడుతుంది.
రాజధాని ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయి. కానీ పార్లమెంటులో రాష్ట్ర విభజన చట్టం సమయంలో రాజధాని నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అనేక అంశాలపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. దొనకొండ, ఒంగోలు, తిరుపతి, కర్నూలు నగరాలను సందర్శించాల్సి ఉంది.
ఈ కమిటీ ఆగస్టు 31 కంటే ముందే నివేదికను కేంద్ర హోంశాఖకు ఇస్తే, ఆ నివేదికను కేంద్రం పార్లమెంటుకు సమర్పించాల్సి ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఒకవేళ కమిటీ నివేదిక వస్తే వెంటనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అనంతరం ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వనికి పంపిస్తారు. ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.

రాజధాని అంటే రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారం అయినందువల్ల మెజార్టీగా ఉన్న అధికారపక్షం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నా, ఏకపక్షంగా ముందుకెళ్లే అవకాశాలు ఉండవు. అసెంబ్లీని సమావేశపరిచి, ఈ అంశంపై చర్చించి, వచ్చిన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చివరకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై రాజధానితోపాటు పలు విద్యా సంస్థలను ఎక్కడ ఏర్పాటు చేయాలో ఖరారు చేస్తుంది.
ఇదంతా పూర్తయ్యే సరికి సెప్టెంబర్ పూర్తి కావొచ్చంటున్నారు. రాజధానిగా ఎంపిక చేసిన ప్రదేశంలో భూమిని గుర్తించి ప్రభుత్వం రెవెన్యూ శాఖ ద్వారా భూసేకరణ చేయాలి. కొత్త రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ టెండర్లను పిలిచే అవకాశముంది. అంతకుముందు స్ధలాన్ని సేకరించి ఇస్తే, ఆర్కిటెక్ట్లు ఒక మాస్టర్ ప్లాన్ను రూపొందించి ఇస్తారు. మాస్టర్ ప్లాన్ల వివరాలను ప్రజలకు తెలియచేయాల్సి ఉంటుంది.
రాజధాని నిర్ణయం, రాజకీయంగా ఏకాభిప్రాయం, కేంద్రం మంజూరు చేసే నిధులు, భూసేకరణ, మాస్టర్ ప్లాన్ పనులు ఇవన్నీ పూర్తయ్యే సరికి వచ్చే ఏడాది జనవరి పట్టవచ్చంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులను బట్టి నిర్మాణం వచ్చే ఆర్దిక సంవత్సరం మే, జూన్ నెలల తర్వాత ప్రారంభం కావొచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications