మీకు ఎలక్టోరల్-మాకు ఎమోషనల్.. ! కేంద్రానికి సాయిరెడ్డి వార్నింగ్ ట్వీట్..
ఏపీలో గత ఎన్నికల తర్వాత వైసీపీ-బీజేపీ మధ్య బంధం బలపడింది. ఎన్నికలకు ముందు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇచ్చిన వైసీపీ..ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండానే ఎన్డీయే సర్కార్ ఏర్పాటు కావడంతో చేసేది లేక కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. బీజేపీ మాత్రం పార్లమెంట్ లో పలుసార్లు ఇది ముగిసిన అధ్యాయమంటూ తేల్చిచెప్పేసింది. ఈ నేపథ్యంలో మరోసారి పార్లమెంట్ సమావేశాల వేళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇదే అంశంపై ట్వీట్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి, ముగిసిన అధ్యాయం ప్రకటన, ఎన్నిక అంశంగా దీన్ని చూస్తున్న తీరును ఎండగట్టేలా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన పరోక్షంగా బీజేపీతో పాటు కేంద్రం తీరును విమర్శించేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రత్యేక హోదాపై ఎన్నికల వేళ వైసీపీ మరో పోరాటానికి సిద్ధం అవుతుందా లేక పార్లమెంటు సమావేశాల వేళ తాము ప్రస్తావించామని చెప్పుకోవడానికే ఈ ట్వీట్ చేశారా అన్న చర్చ జరుగుతోంది.

ఇంతకీ విజయసాయిరెడ్డి ట్వీట్ లో ఏం చెప్పారో ఓసారి చూద్దాం. " ఏపీకి ప్రత్యేక హోదా అంశం పాతది కాదూ ముగిసిన అంశమూ కాదు. ఏపీకి గతంలో మాటిచ్చి తప్పిన హామీపై కేంద్రంతో పాటు దాని మిత్రపక్షాలకూ వైసీపీ ఎంపీలు గుర్తుచేస్తూనే ఉన్నారు. ఇతర పార్టీలకు ప్రత్యేక హోదా ఎన్నికల అంశం కావచ్చేమో కానీ మాకు మాత్రం భావోద్వేగంతో కూడుకున్నది" అంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి గుర్తుచేస్తూనే ఉన్నట్లు వైసీపీ చెబుతూనే ఉంది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లు సీఎంవో ప్రెస్ నోట్లలోనూ చెబుతోంది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో మరోసారి ఎన్నికలకు ముందు ఈ వ్యవహారం తెరపైకి వచ్చేలా కనిపిస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications