మోడీ మన్కీ బాత్ కాదు...ధోకా బాత్ అని మార్చండి:అనురాధ
విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఆదివారం రేడియోలో ప్రసంగిస్తున్న మన్కీ బాత్ను ధోకా బాత్గా మార్చుకోవాలని టిడిపి నేత పంచుమర్తి అనురాధ విమర్శించారు. ప్రధాని తన మనసులో మాటలంటూ చెబుతున్నవి కేవలం మోసపు మాటలంటూ ఆమె మండిపడ్డారు.
సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని విమర్శించారు. పార్లమెంట్లో సమావేశాలు జరగకుండా 14 రోజులుగా కార్యక్రమాలు నిలిచిపోయాయని, టిడిపి ఇచ్చిన అవిశ్వాసంపై ఎందుకు చర్చ జరపడం లేదని ఆమె ప్రశ్నించారు.
పట్టిసీమ కాంట్రాక్టర్కు సన్మానం చేయాలని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు ఆనాడు మాట్లాడారని...ఇప్పుడు అదే ఎమ్మెల్యే అవినీతి జరిగిందని అంటున్నారని ధ్వజమెత్తారు. బిజెపి నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే...గుజరాత్ కాగ్ రిపోర్ట్పై చర్చకు సిద్ధమా?...అంటూ పంచుమర్తి అనురాధ సవాల్ విసిరారు.