TDP: బండెనక బండి కట్టి 16 బళ్లు కట్టి: నారా లోకేష్ పాదయాత్ర??
బండెనక బండి కట్టి.. 16 బళ్లు కట్టి.. ఏ పల్లెకు పోతావు కొడకో.. అనే పాటను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలపించాల్సిన సమయం ఆసన్నమైంది. పాదయాత్రల బండి నుంచి వచ్చే శబ్దాలు వినడానికి వారంతా సిద్ధమవుతున్నారు. పాదయాత్ర అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రే గుర్తుకు వస్తుంది. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని తర్వాత ఎంతోమంది రాజకీయ నేతలు పాదయాత్రలు చేశారు.. చేస్తున్నారు.. చేయబోతారు అని స్పష్టమవుతోంది. ఎందుకంటే ప్రజలపై అంత గాఢమైన పాదయాత్ర ముద్రను వైఎస్ వేశారు.

అధికారం కోసం టీడీపీ మరో పాదయాత్ర?
తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మరో పాదయాత్ర సిద్ధమవుతోంది. గతంలో "మీ కోసం" పేరుతో చంద్రబాబునాయుడు 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర ఆయన్ను అధికారంలోకి తెచ్చింది. 2019 ఎన్నికల పరాజయం తర్వాత మహానాడుతో నూతన ఉత్తేజాన్ని పొంది తెలుగుదేశం పార్టీ ఏ క్షణమైనా రాష్ట్రంలో ఎన్నికలు రావచ్చనే అంచనాలో ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ ఆరునెలల నుంచే పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాయకులను, కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు.

ఆగస్టులోకానీ, నవంబరులోకానీ?
చంద్రబాబు తర్వాత పార్టీలో అంతా తానైన ఆయన తనయుడు నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ యాత్ర ఆగస్టులోకానీ, నవంబరులో కానీ ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఇంటింటికీ పంపించి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరించి చెప్పిస్తున్నారు.

పార్టీ జవసత్వాల కోసం..
ఏడాది కాలం ఉండే ఈ కార్యక్రమం ముగిసేలోగానే జగన్ ఎన్నికలకు వెళ్లవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పార్టీలో నూతన ఉత్తేజం తెచ్చేందుకు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఎక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాలి? ఏయే నియోజకవర్గాల్లో సాగాలి? రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఇలాంటి ప్రతిపాదనలన్నీ సిద్ధమవుతున్నాయి. తర్వాత ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications