ఏపీ రాజధానికి జంట నగరాల కాన్సెప్ట్ - పంచ నదుల జిల్లాలో పాపాలు - విజయసాయిరెడ్డి దూకుడు
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చాయనే గెజిట్ నోట్ పై ఏపీ హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులపై జగన్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజధానుల ఏర్పాటు రాష్ట్రాల ఇష్టమేనంటూ ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో విచారణ ఆసక్తికరంగా మారింది. మూడు రాజధానులపై ముందుకే వెళ్తామంటోన్న అధికార వైసీపీ.. దాని అవసరతను ప్రజలకు వివరించే పనిలో పడింది. అందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సరికొత్త అంశాలను వెల్లడిస్తున్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ తరహాలో ఏపీ కొత్త రాజధానికి జంట నగరాల కాన్సెప్ట్ తో ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లాల వారీగా సిరీస్..
పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల అవసరతను తెలియజేస్తూ, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా నెలకొన్న పరిస్థితులు, గత చంద్రబాబు హయాంలో ఆయా జిల్లాలు అన్యాయానికి గురైన తీరును, రాబోయే రోజుల్లో జగన్ చేయబోయే అద్భుతాలివంటూ విజయసాయిరెడ్డి ఏకరువుపెట్టారు. జిల్లాల వారీగా సిరీస్ ను రాసుకొస్తున్న ఆయన.. ఇప్పటికే ‘శ్రీకాకుళం జిల్లాను చిదిమేశారు' శీర్షికతో సిక్కోలుపై కొత్త, పాత అంశాలను పేర్కొన్నారు. తాజాగా ‘విజయనగరాన్ని విస్మరించారు'అంటూ చంద్రబాబు, అశోక్ గజపతిరాజులపై నిప్పులు చెరిగారు. కాగా, కొత్త కార్యనిర్వాహక రాజధాని విశాఖను ఇప్పటికే కాన్సెప్ట్ సిటీగా ప్రకటించగా, దానికి సమీపంగా ఉండే విజయనగరంపై జగన్ రూపొందిస్తోన్న ఆసక్తికర ప్రణాళికల్ని ఎంపీ వివరించారు. సాయిరెడ్డి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

రాజధానితో జంటనగరాలు..
‘‘విశాఖపట్నానికి విజయనగరం జస్ట్ 50 కిలోమీటర్లు. నాన్ స్టాప్ బస్సులో గంట జర్నీ. అందుకే విశాఖ పాలనా రాజధానికావడంతో మళ్లీ విద్యలనగరంగా అభివృద్ధి చెందబోతోంది . విజయనగరం సరిహద్దుకు ఆనుకునే అభివృద్ధి వస్తుంది. హైదరాబాద్-సికింద్రాబాద్ లాగా విశాఖ-విజయనగరం జంట నగరాలుగా అభివృద్ధి చెందే ఆస్కారము ఉంది. విశాఖ పాలనా రాజధానైతే ఎక్కువగా లబ్ధిపొందేది విజయనగరమే- ఎన్నో శాటిలైట్ టౌన్ షిప్పులు, మెట్రో రైలు వస్తాయి. విశాఖతో సమానంగా విజయనగరాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది.

పంచ నదుల జిల్లాను ఆగం చేశారు..
విజయనగరం అనగానే విద్యలనగరం, సాంస్కృతిక కూడలి , సంగీత సెంటర్ ఇలా గత వైభవం కళ్లముందు మెదులుతుంది. సువర్ణముఖి, చంపావతి, గోస్తని, నాగావళి, వేగావతి, గోముఖ లాంటి నదీనదాలు ప్రవహిస్తున్న ప్రశాంతమైన జిల్లాను - గజపతి రాజుల్లో ఒక వర్గాన్ని, మాన్సాస్ ట్రస్ట్ ను ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో భ్రష్టుపట్టించాడు. మెజార్టీ వర్గాలైన కాపు, వైశ్య, ఎస్సీ,ఎస్టీలను పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా... వీలైనంతగా అణగదొక్కాడు చంద్రబాబు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికే ముఖ్యమంత్రులను అందించిన జిల్లా. విజయనగరం జిల్లాలో పంచనదులున్నా చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క సాగునీటి లేదా తాగునీటి ప్రాజెక్టు కట్టిన పాపానపోలేదు. వైఎస్ఆర్ ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించాడు చంద్రబాబు. జిల్లావాసులకు ఉపాధికల్పిస్తున్న జ్యూట్, ఫెర్రో అలోయిస్ ఇండస్ట్రీలు మూతపడేలా చేశారు. హస్తకళలు, చేతివృత్తులను పూర్తిగా చిదిమేశాడు.

అశోక్ గజపతి తప్పుల చిట్టా ఇదంటూ..
విజయనగరానికి అన్నీ తానేనని చెప్పుకునే అశోక్ గజపతి మహారాజావారు.. సామ్రాజ్య ఆస్తులను ఏటీఎంలా వినియోగించుకోవడంలో చంద్రబాబుకు సహకరించారు. ఆనంద గజపతిరాజు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నంతవరకూ విజయనగరం ఒక్క వెలుగువెలిగింది. ఆ తర్వాత విజయనగర వైభవాన్ని మసకబార్చారు అశోక్ గజపతి. ఎమ్మెల్యేలు, ఎంపీలకే ఆయన దర్శనం దొరకదు... ఇక సామాన్యులను పట్టించుకుంటారా? విమానయాన మంత్రిగా భోగాపురం ఎయిర్ పోర్టును ఇంచ్ కూడా కదల్చలేకపోయారు. సొంత అన్నగారి కుమార్తె సంచయిత మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు చేపడితే... ఆమెను, ఆమె చెల్లెలు ఊర్మిళ ను కించపరుస్తూ మాట్లాడారు.

రాజులకు ప్రజలే బుద్ది చెప్పారు..
విజయనగరం జనాభాలో దాదాపు 20 శాతం తూర్పుకాపులు, కాపులే కానీ వారిలో రాజకీయ చైతన్యం వస్తే ఎక్కడ తమను పట్టించుకోరోనన్న కుట్రతో చంద్రబాబు, అశోక్ గజపతి అణిచివేతకు పాల్పడ్డారు. చీపురుపల్లిలో గద్దె బాబురావును నాలుగుసార్లు గెలిపించడంతో అశోక్ గజపతిరాజు కీలకపాత్ర పోషించారు. అక్కడ కాపులకు మొండిచేయి చూపించారు. అంతెందుకు అశోకుని కుమార్తె అతిది పోటీచేస్తాననగానే సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు ఇంటికి పంపించేశారు. బాబు హయాంలో విజయనగరంలో ఆస్తి పోరాటాలు - అస్తిత్వపోరాటాల్లోనే స్థానిక నేతలు మునిగితేలారు తప్ప ప్రజల బాగోగులు పెట్టించుకోలేదు. రాజులకన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యం... ప్రజా సమస్యలు పట్టించుకుని - వారికోసం పనిచేసేవారే మిగులుతారు. అందుకే విజయనగరంలో అశోక్ గజపతిరాజు కుటుంబం, బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు, కురుపాం కిషోర్ చంద్రదేవ్, చిన్నమేరంగి రాజావారు శత్రుచర్ల విజయరామరాజు కుటుంబాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.

విజయనగరంపై జగన్ బ్లూ ప్రింట్..
రాజధాని విశాఖతో సమానంగా విజయనగరాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. జగన్ వచ్చాకే భోగాపురం ఎయిర్ పోర్టుపై జీఎంఆర్ తో ఒప్పందం కుదిర్చారు. మరో రెండు మూడేళ్లలో అది అందుబాటులోకి రానుంది. అశోక్ గజపతి ఇంటిపక్కనే ఉన్న ఈస్ట్ కోస్ట్ , అరుణ జ్యూట్ మిల్లుల్ని వైసీపీ సర్కారు పున:ప్రారంభిస్తుంది. శ్రీపైడితల్లి , రామతీర్థం ఆలయాలను అభివృద్ధి చేస్తుంది. రీస్టార్ట్ ప్యాకేజ్ కింద విజయనగరంలో 105 చిన్న మధ్యతరహ పరిశ్రమలకు ప్యాకేజ్ అందడంతో తిరిగి తెరుచుకున్నాయి. పంచనదుల జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని జిల్లాను సస్యశామలం చేయబోతున్నది'' అని ఎంపీ విజయసాయి రెడ్డి వివరించారు. రాజధాని విశాఖకు జంటగా విజయనగరాన్ని అభివృద్ధి చేస్తామన్న వైసీపీ ఎంపీ వ్యాఖ్యలపై, చంద్రబాబు, అశోక్ గజపతిరాజును ఉద్దేశించి చేసిన ఆరోపణలపై టీడీపీ స్పందించాల్సిఉంది.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications