ఏపీ టూ హైదరాబాద్ ..కారులో సీక్రెట్ లాకర్స్ ... భారీగా హవాలా దందా
హవాలా మార్గంలో ఏపీ నుండి హైదరాబాద్ కు జరుగుతున్న నగదు లావాదేవీల గుట్టు రట్టు చేశారు విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి హైదరాబాద్ కు భారీగా నగదును తరలిస్తున్న ఓ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు దీని వెనక ఉన్న సూత్రధారులను మరికొందరిని పట్టుకొని ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు .

హవాలా మార్గంలో డబ్బు .. కార్ సీట్ వెనుక సీక్రెట్ అరలలో డబ్బు తరలింపు యత్నం
హవాలా డబ్బు కనిపించకుండా ఉండేలా సీటు వెనుక ప్రత్యేక బాక్సులో అమర్చి తరలించే ప్రయత్నం చేసిన హవాలా రాకెట్ గుట్టు రట్టు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు హవాలా లావాదేవీలపై కొరడా ఝుళిపించారు. ఈ నగదు పై ఇన్కమ్ టాక్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సైతం సమాచారం అందించారు.
పోలీస్ కమిషనర్ బి శ్రీనివాసులు చెప్పిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కి చెందిన ఓ గ్యాంగ్ ఈ దందాకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది.

హవాలా డబ్బు తరలింపుకు యత్నం .. జ్యూయలరీ మార్ట్ యజమానితో పాటు ముగ్గురి అరెస్ట్
నరసాపురం కు చెందిన ఆనందరావు, అతని సోదరుడు హరిబాబు దేవి జ్యూయలరీ మార్ట్ లో పని చేస్తున్నారు. ఈ జ్యూయలరీ మార్ట్ కు సంబంధించిన యజమాని ప్రవీణ్ కుమార్ జైన్ వీరి ద్వారా హవాలా మార్గంలో డబ్బులు తరలించే ప్రయత్నం చేశారు. వీరిరువురికీ 50 లక్షల రూపాయలు, 34 వేల అమెరికన్ డాలర్ల హవాలా నగదును ఇచ్చి,విజయవాడకు చెందిన వల్లూరి శివనాథ్ వద్ద 50 లక్షలు, భరత్ వద్ద 20 లక్షలు, ఉత్తమ్ అనే మరో వ్యక్తి వద్ద 15 లక్షలు, దివాకర్ వద్ద 12 లక్షల రూపాయలు తీసుకొని హైదరాబాదులో ఉన్న తన సోదరుడు కీర్తి జైన్ కి ఇచ్చి రావాలని ఆదేశించాడు.

34 వేల అమెరికన్ డాలర్లు,1.47 కోట్ల నగదును సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
మొత్తం 34 వేల అమెరికన్ డాలర్లు,1.47 కోట్ల నగదును ఎలాంటి బిల్లులు లేకుండా తరలించడానికి ప్రత్యేకంగా సీటు వెనుక తయారు చేసిన బాక్స్ లో దాచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. విజయవాడ నగరంలోని గొల్లపూడి వద్ద వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు కారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలలో హవాలా నగదును, డాలర్లను భారీ మొత్తంలో పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు.

ఎలాంటి బిల్లులు లేకుండా హవాలా మనీ దందా
ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ జైన్ తో పాటుగా మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు
హైదరాబాద్ లో జ్యూవెలరీ వ్యాపారం నిర్వహిస్తున్న తన సోదరుడు కీర్తి జైన్ కు నగదును అప్పగించాలని చెప్పినట్లుగా గుర్తించారు.
నర్సాపురం ప్రాంతంలో విదేశాల నుండి వచ్చే వచ్చే వారి వద్ద నుండి తక్కువ ధరకు విదేశీ మారకద్రవ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్న పోలీసులు, హైదరాబాద్లో వీటిని ఎక్కువ ధరకు విక్రయించి క్యాష్ చేసుకుంటున్నారని తెలిపారు.

గతంలో నెల్లూరులోనూ ఈ గ్యాంగ్ కార్యాకలాపాలు
గతంలోనూ నెల్లూరు జిల్లాలో ఇదే తరహా హవాలా డబ్బు పట్టుబడింది అని పేర్కొన్నారు. అప్పుడు కూడా ఇదే ముఠా హవాలా డబ్బు తరలిస్తూ దొరికిందని తెలిపిన పోలీస్ కమిషనర్ భవాని పురం పోలీస్ స్టేషన్ లో వీరిపై కేసు నమోదు చేసినట్లు గా పేర్కొన్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా హవాలా మార్గంలో డబ్బు తరలింపుతో ప్రభుత్వ ఆదాయానికి తీవ్రంగా గండి పడుతుందని సి పి బి. శ్రీనివాసులు పేర్కొన్నారు.
ఎవరైనా ఇలాంటి హవాలా డబ్బు చేరవేస్తే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు .












Click it and Unblock the Notifications