జపాన్, సింగపూర్ సహకారంతో వరల్డ్ క్లాస్ రాజధాని
విజయవాడ/ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సింగపూర్ ఆర్కిటెక్ట్లు, పారిశ్రామికవేత్తలు భాగం పంచుకోనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజధాని నిర్మాణానికి సహకారం అందించేందుకు సింగపూర్ సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు.
అలాగే, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అక్కడి పలు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. 2028 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా రూపుదిద్దేందుకు తాను చేస్తున్న కృషిలో తొలి మెట్టుగా సింగపూర్ పర్యటన ఉపకరించిందన్నారు. విజయవాడలో గురువారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో తన సింగపూర్ పర్యటన అనుభవాలను ఆయన ప్రజాప్రతినిధులతో పంచుకున్నారు.
వచ్చే పదిహేనేళ్లలో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, టార్గెట్ 2029 లక్ష్యంతో ప్రభుత్వ అజెండాలో ఉన్న అన్ని పథకాలను, అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో హార్డ్వేర్, ఆగ్రో ఎకో జోన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్ర్టానిక్స్ రంగానికి కూడా రాష్ట్రం అనువుగా ఉందన్నారు. మూడు రోజులపాటు సింగపూర్లో మొత్తం 200 కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రాభివృద్ధి పైన రూపొందించిన అంశాలను వివరించామన్నారు.
ఏపీ అభివృద్ధికి 15 ఏళ్లు కూడా పట్టబోదన్నారు. సింగపూర్ తరహాలో నిర్మించబోతున్నామన్నారు. భవనాలను నిర్మించే అవకాశం ఎక్కడైనా దొరుకుతుందని, కానీ రాజధానిని నిర్మించే అవకాశం ఏపీలో మాత్రమే దొరుకుందని సింగపూర్ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు స్పష్టం చేశామన్నారు. రాజధానితోపాటు విశాఖ, తిరుపతి సహా మరో 14 నగరాలను స్మార్ట్సిటీలుగా అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం, ప్రైవేటు రంగాల సహకారాన్ని కోరామన్నారు.
సెంటర్ ఫర్ లివబుల్ సిటీ సీఈవో ఖూతెంగో చెయ్ డిసెంబర్ 9 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారన్నారు. ఏవియేషన్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ఇండిగో గ్రూప్.. టూరిజం హబ్గా రూపొందించేందుకు టాటా, ఎస్ఐఏ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు.
కొత్త రాజధాని నిర్మాణంలో సహకరించేందుకు సుర్బానా కంపెనీ ముందుకొచ్చిందని, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో సహకారానికి మీర్ హార్ట్ కంపెనీ, ఇండస్ట్రియల్ టౌన్షిప్ల అభివృద్ధికి జురాంగ్ ప్రతినిధులు ముందుకొచ్చారన్నారు. జురాంగ్ ప్రాజెక్టు నమూనాలో రాష్ట్రంలో ఒక కెమికల్ హబ్ను ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు. దేశానికే లాజిస్టిక్ హబ్గా ఏపీని రూపొందిస్తామన్నారు.
జపాన్ పర్యటన ఖరారు
చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 24 నుంచి 29 వరకు జపాన్లో చంద్రబాబు పర్యటించనున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఏపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్, సీఎం రమేష్, గల్లా జయదేవ్, పరకాల ప్రభాకర్ పలువురు ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు వెంట జపాన్ వెళ్లనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాజధాని నిర్మాణం కోసం సలహాలను స్వీకరించడమే చంద్రబాబు జపాన్ పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.
ఏపీలో వ్యాపార అవకాశాలు పుష్కలం
ఏపీ, జపాన్ ప్రతినిధి బృందాల మధ్య గురువారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. చంద్రబాబు నాయకత్వంలో త్వరలో జపాన్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
జపాన్ దౌత్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు సారథ్యంలోని బృందం జపాన్ ఇండియా వ్యాపార సమన్వయ సఘం సభ్యులు పాల్గొన్నారు. జపాన్ బృందానికి టకేషియగీ సారథ్యం వహించారు. కంభంపాటి మాట్లాడుతూ.. ఏపీలోని వివధ రంగాల్లో ఉన్న పలు అవకాశాల గురించి వివరించారు. ఈ నెల 24 - 29 తేదీల్లో చంద్రబాబు జపాన్లో పర్యటించనున్నారని చెప్పారు.