విచారణ భయంతో కేంద్రంతో రాజీకి బాబు యత్నం:వైసిపి ఆరోపణ
అమరావతి:ఒకవైపు కేంద్రంతో పోరాటం చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్న చంద్రబాబు తమ అవినీతిపై విచారణ అనగానే...మరోవైపు అదే కేంద్రంతో రాజీ యాత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షపార్టీ వైసిపి ఆరోపిస్తోంది. అందుకు టిడిపి అనుకూల పత్రికలో వచ్చిన వార్తే ఆధారం అంటోంది.
Recommended Video
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
ఎపికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం అంటూ...తెలుగుజాతి ఆత్మగౌరవ సమస్య అని ఒకరోజు...రాష్ట్రంపై కేంద్రం యుద్ధం చేస్తోందని మరో రోజు...ఇలా రకరకాల విన్యాసాలతో తన పోరాట నాటకాన్ని రక్తి కట్టిస్తున్న చంద్రబాబు ఆ ముసుగు కూడా త్వరలోనే తొలగిపోనుందని వైసిపి విమర్శిస్తోంది. అయితే కేంద్రం ఎప్పుడయితే తమ అవినీతిపై విచారణ జరిపించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయో మళ్లీ లాలూచీ యత్నాలు ప్రారంభించారని వైసిపి అంటోంది.
యూటర్న్ లే యుటర్న్ లు...మరోసారి
నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారాన్ని పంచుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన వంటివి ఏవీ సాధించకపోగా, ప్రత్యేక ప్యాకేజ్ కోసం స్పెషల్ స్టేటస్ ను కనుమరుగు చేయాలని శాయశక్తులా ప్రయత్నించిన చంద్రబాబు...ఇప్పుడు ప్రజలే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న దశలో మరోసారి హఠాత్తుగా యూటర్న్ తీసుకుని తానే ప్రత్యేక హోదా కోసం ముందునుంచీ పనిచేస్తున్నట్లు నమ్మించేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారని వైసిపి ఎద్దేవా చేస్తోంది.
విచారణ భయంతో...కేంద్రంతో రాజీకి యత్నం...
కేంద్రంతో రాజీ లేని పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న చంద్రబాబు ఎప్పుడయితే బిజెపి నేతలు పట్టిసీమతో సహా వివిధ కార్యక్రమాల్లో అవినీతిపై విచారణ జరుగుతుందని అనగానే...నాలుగేళ్లుగా తాము చేస్తున్న లక్షల కోట్ల అవినీతి వ్యవహారాలు ఎక్కడ బైటపడతాయో అని వణికిపోతున్నారని...అందుకే ఒకవైపు పోరాటం అంటూనే మరోవైపు కేంద్రంతో రాజీకి ప్రయత్నాలు ప్రారంభించినట్లు వైసిపి ఆరోపిస్తోంది. అందుకు టిడిపి అనుకూల పత్రికలో వచ్చిన వార్తే రుజువు అని, బీజేపీయే దిగివచ్చి చంద్రబాబుతో ‘కలిసుందాం..ఇంకా దూరం పెంచుకోవద్దు' అని రాజీ ప్రతిపాదనలు చేస్తున్నట్లు అందులో వచ్చిందని వైసిపి ఆరోపిస్తోంది. అయితే అందులో బిజెపి నేతలే దిగివచ్చి మీరు కోరినవాటిలో ప్రధానమైనవి ఇస్తాం...పోరాటం ఆపేయండని బ్రతిమాలుతున్నట్లు రాసారని, అయితే వాస్తవంగా టిడిపి ఎంపిలే వెళ్లి బిజెపి ముఖ్య నాయకులతో రాజీ చర్చలు జరిపారని...రాష్ట్రానికి సంబంధించి "ఏదో ఒక సానుకూల ప్రకటన చేసి మమ్మల్ని బయటపడే యండి రాజీపడతాం"... అని వారి ద్వారా చంద్రబాబు అభ్యర్థిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని వైసిపి చెబుతోంది.
బాబు పప్పులుడక లేదు...వైసిపి ఎద్దేవా
వైసిపి గతంలోనే పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులలో అడ్డగోలుగా అవినీతిపై సాక్ష్యాధారాలతో అనేకమార్లు బయటపెట్టిందని, వీటిపై మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయని చెప్పిన వైకాపా...ఈ ప్రాజెక్టుల్లో అవినీతిపై కాగ్ తూర్పారబట్టిన విషయం...ప్రజాపద్దుల కమిటీ ఆక్షేపించిన సంగతి గుర్తుచేస్తోంది. అయితే బిజెపికి టీడీపీతో చెడిన తర్వాత ఈ అవినీతిపై విచారణ జరగాల్సిందేనని ఇప్పుడు డిమాండ్ చేస్తోందని వైసిపి అంటోంది. దీంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని, నిజంగానే సీబీఐ విచారణ జరిగితే అడ్డంగా దొరికిపోతామన్న వణుకు బాబులో మొదలైందని అన్నారు. అందుకే ఢిల్లీలో మళ్లీ బిజెపితో రాజీ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదని తెలుస్తోందన్నారు. కేంద్రం నుంచి సానుకూల ఫలితం రావడం లేదనే విషయం గురువారంనాడు బాబు అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని చూసిన వారందరికీ స్పష్టంగా అర్థమయ్యిందని వైసిపి ఎద్దేవా చేసింది.
విచారణ అంటే...భయమెందుకు?...
అవినీతి జరగలేదనే విషయం చెప్పకుండా అవినీతి గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని చంద్రబాబు, టిడిపి నేతలు అనడమేమిటని వైసిపి ప్రశ్నిస్తోంది. అవినీతి జరిగితే ఎప్పుడైనా అడగొద్దా అంటోంది. ఒకవైపు విచారణ చేసుకోండని అంటూనే నా పైన విచారణ ఎలా చేస్తారని చంద్రబాబు ప్రశ్నించడంపై వైసిపి ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తప్పు చేసినట్లు ఆరోపణ లొస్తే విచారణ జరపడం తప్పెలా అవుతుందని వైసిపి అడుగుతోంది. ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని...ప్రత్యేక హోదా ఇచ్చి అది ఎవరో పోరాడితే ఇచ్చినట్లు కేంద్రం చెప్పబోతోందని చంద్రబాబు వ్యాఖ్యానించడం ఏమిటని...రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ఆశగా ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదా రావడమే ముఖ్యం కాని దాన్ని ఎవరు సాధిస్తే ఏమిటని వైసిపి మద్దతుదారులు అంటున్నారు.
రాజీ యత్నాల వార్తలపై...చంద్రబాబు ఆగ్రహం...
మరోవైపు కేంద్రంతో రాజీకి టిడిపి ప్రయత్నిస్తోందన్న వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తమ పార్టీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సుజనా చౌదరి-అరుణ్ జైట్లీ సమావేశం ప్రతిపక్షాల నుంచి ఆరోపణలకు అవకాశం ఇచ్చినట్లు ఎపి టిడిపి మంత్రులు అభిప్రాయపడిన నేపధ్యంలో చంద్రబాబు ఢిల్లీలోని ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడినట్లు తెలసింది. ఈ వార్తలు ఎలా లీక్ అవుతున్నాయని...బిజెపి కావాలనే తమని ఉచ్చులో బిగించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని...అందువల్ల టిడిపి ఎంపీలు అప్రమప్తంగా ఉండాలని హితువు పలికినట్లు సమాచారం. బిజెపి కావాలనే టిడిపి ఎంపీలతో రాజీ యత్నాల కోసం వివిధ హామీలు ఇస్తామంటూ చర్చలకు పిలుస్తూ...టిడిపినే వారితో లాలూచీకి ప్రయత్నిస్తుందని ప్రచారం చేస్తుందని...అందుకే అలాంటి ఇరికించే కవ్వింపు చర్యల్లో చిక్కుకోవద్దని...చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని టిడిపి ఎంపీలను హెచ్చరించారట.