ఏపీలో వైఎస్ షర్మిలకు రెడ్ కార్పెట్: ఇంకొన్ని గంటల్లో అధికారిక ప్రకటన?
YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోన్న తాజా అంశం.. వైఎస్ షర్మిల ఎంట్రీ. త్వరలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోబోతోన్నారని, ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రిగా కూడా షర్మిల్ అపాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తోన్నాయి.
ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వవైభవం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలను అప్పగించవచ్చనేది ఆ వార్తల సారాంశం.

అదే జరిగితే- ఏపీలో అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ వైరం ఏర్పడటం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు.. స్వయానా ఆయన చెల్లెలు ఏపీసీసీ చీఫ్గా మరోవైపు పోరాటానికి దిగే వాతావరణం ఏర్పడుతుంది. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
ఏపీలో పార్టీని బలోపేతం చేయాలనే పట్టుదలతో ఉంది ఏఐసీసీ. కర్ణాటక, తెలంగాణల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో అదే ఊపును ఏపీ రాజకీయాల్లోనూ తీసుకుని రావాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఢిల్లీలో ఏపీసీసీ నేతలతో ఢిల్లీలో సమావేశం కానుంది. ఢిల్లీ రావాలంటూ ఆదేశించింది.
మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతోన్న నేపథ్యంలో పార్టీ స్థితిగతులపై ఆరా తీయనుంది. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకోవడం, ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక.. వంటి అంశాలపై చర్చించనుంది. ఈ భేటీలో షర్మిల అంశం ప్రస్తావనకు వస్తుందని చెబుతున్నారు. కీలక ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

ఈ పరిణామాలపై తాజాగా ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పందించారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్లోకి వస్తే ఆహ్వానిస్తామని అన్నారు. పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానికి తాము శిరసా వహిస్తామని వివరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా పార్టీలోకి చేరే హక్కు ఆమెకు ఉందని, దీనికి అందరూ స్వాగతించాల్సి ఉంటుందని అన్నారు.
షర్మిలకు ఎలాంటి బాధ్యతలను అప్పగించినా.. దాన్ని కాదనే హక్కు ఏపీ కాంగ్రెస్లో ఎవరికీ లేదనీ తేల్చి చెప్పారు గిడుగు రుద్రరాజు. తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని తేల్చి చెప్పారు. షర్మిల రాకను ఎవరూ అభ్యంతరం పెట్టరనే తాను భావిస్తున్నానని చెప్పారు. ఆమె రాకను తాను స్వాగతిస్తానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications