జగన్-సెకీ డీల్ పై ఏసీబీకి షర్మిల ఫిర్యాదు-చంద్రబాబు మౌనంపై తీవ్ర విమర్శలు..!
ఏపీలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)తో గత వైసీపీ సర్కార్ కుదుర్చుకున్న 7 వేల కోట్ల సౌర విద్యుత్ సరఫరా ఒప్పందం విషయంలో అప్పటి సీఎం జగన్ కు రూ.1750 కోట్లు ముడుపులు అందాయన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె విజయవాడ బస్టాండ్ లో ఉన్న ఏసీబీ కార్యాలయానికి వెళ్లి అధికారులకు దీనిపై ఆధారాలు సమర్పించారు.
ఏపీలో సీఎంగా ఉన్న జగన్ కు రూ.1750 కోట్ల లంచం ఇచ్చారని అమెరికాలో దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయని, దీంతో అక్కడి సెక్యూరిటీ ఎక్స్ఛైంజ్ కమిషన్ కేసులు కూడా పెట్టారని షర్మిల తెలిపారు. అదానీ సంస్థల ద్వారా అమెరికాలో కూడా పెట్టుబడులు పెట్టాలనుకున్నారని ఆరోపించారు. ఛార్జిషీట్ లో పెట్టిన ప్రకారం జగన్ తో అదానీ భేటీ అయి సోలార్ పవర్ డీల్ తో ఆయనకు మేలు చేసేలా చేశారని పలు సాక్ష్యాలు ఉన్నాయన్నారు. 2021లో ఇంత అవినీతి జరిగితే మన దర్యాప్తు సంస్థలు ఎందుకు బయటపెట్టలేదని షర్మిల ప్రశ్నించారు.

ప్రస్తుతం ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ గతంలోనే ఈ అవినీతి వల్ల రాష్ట్రంపై భారం పడబోతోందని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారని షర్మిల గుర్తుచేశారు. చంద్రబాబుకు, టీడీపీకి 2021లోనే ఇంత అవినీతి జరిగిందని తెలిసినా ఇప్పటికీ చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జగన్ వద్దు, చంద్రబాబు కావాలనే కదా జనం ఓట్లేసింది, మరి ఆయన అదానీ పేరు పలకడానికే భయపడుతున్నారన్నారు. ఎన్డీయే పొత్తు కారణంగా మోడీకి మిత్రుడైన అదానీ గురించి చంద్రబాబు మాట్లాడటం లేదన్నారు. అదానీనీ కాపాడే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications