విమర్శించే ధైర్యం చేసిన వైఎస్ షర్మిల
Vinukonda Murder: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య.. కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయి ఉద్యమానికి పూనుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లనుంది.
వైఎస్ఆర్సీపీ నాయకుడు రషీద్ను వినుకొండలో తెలుగుదేశం పార్టీకి చెందిన జిలానీ నడిరోడ్డుపై నరికి చంపాడు. చేతులు నరికాడు. మెడపై పలుమార్లు కత్తితో నరికాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయాయి. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించారు.

దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందంటూ మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించట్లేదంటూ విమర్శించారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా వినుకొండ హత్యపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు. వినుకొండ హత్య ఘటన అత్యంత దారుణమని వ్యాఖ్యానించారు. సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఇప్పటికే శాంతి భద్రతలు క్షీణించాయని, ఇంకెంత దిగజారాలని ప్రశ్నించారు.
నడిరోడ్డు మీద ఆటవికంగా నరుక్కుంటుంటే పోలీసులు ఏమి చేస్తున్నరాంటూ వైఎస్ షర్మిల నిలదీశారు. ఇది వ్యక్తిగత కారణాలు, కక్షల వల్ల జరిగివుంటే నేరస్తుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సి ఉంటుందని అన్నారు. ఒకవేళ ఇది రాజకీయ హత్యే అయితే, కూటమి సర్కారుకు ఇదే హెచ్చరిక అని పేర్కొన్నారు.
ఇటువంటి ఘటనలు ఆదిలోనే ఆపకపోతే ఇది తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిది కాదని షర్మిల అన్నారు. నాగరిక సమాజంలో ఇలాంటి దుశ్చర్యలకు తావు లేదని పేర్కొన్నారు. వీటికి అడ్డుకట్ట వేస్తారా లేదా? అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు డిమాండ్ చేశారు. రాష్ట్రం రావణకాష్టం అవుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications