అమరావతి పాత ప్లాన్ కే చంద్రబాబు మొగ్గు-సింగపూర్ సపోర్ట్-సీఆర్డీయే కీలక నిర్ణయాలు...!
ఏపీ రాజధాని అమరావతికి పునర్ వైభవం కల్పించేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కార్ ఇవాళ నిర్వహించిన సీఆర్డీయే భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా గతంలో సీఆర్డీయే ప్రాంతంగా నిర్ణయించిన ఏరియాలో చోటు చేసుకున్న మార్పుల్ని రద్దు చేయడంతో పాటు తిరిగి యథాతథంగా సింగపూర్ మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు సిద్దమవుతోంది. అలాగే అమరావతిలో ఎవరెవరికి భూకేటాయింపులు చేయాలి, కన్సల్టెంట్ల నియామకం వంటి నిర్ణయాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీయే భేటీలో 12 నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో అమరావతిని సంపద సృష్టి కేంద్రంగా మార్చే సంస్థలకే భూకేటాయింపులు చేయాలని నిర్ణయించారు. అలాగే గతంలో జరిగిన భూకేటాయింపులను సమీక్షించి ఇందులో పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే వాటిని కొనసాగించాలని, లేకుంటే రద్దు చేయాలని నిర్ణయించారు. అమరావతిలో గతంలో భూములు తీసుకున్న సంస్థలకు వాటిని నెలకొల్పేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

గతంలో 2015లో ఇచ్చిన జీవో 207 ప్రకారం రాజధాని ప్రాంతం మొత్తం 8352 చదరపు కిలోమీటర్లు కొనసాగించాలని నిర్ణయించారు. గతంలో గుర్తించిన పరిధే రాజధానికి కొనసాగించాలని, ఇందులో నుంచి మధ్యలో వైసీపీ సర్కార్ తొలగించిన ప్రాంతాన్ని తిరిగి కలపాలని నిర్ణయించారు. అలాగే వైసీపీ పాలనలో తెచ్చిన ఆర్ 5 జోన్ ను కూడా న్యాయ నిర్ణయం ప్రకారం రద్దు చేయనున్నారు. సీఆర్డీయే ప్రాంతంలో అభివృద్ధికి సూచనలు ఇచ్చేందుకు 32 కన్సల్టెంట్ సంస్థల్ని తీసుకోనున్నారు. అలాగే సీఆర్డీయేలో కొత్తగా 778 మంది ఉద్యోగులను తీసుకుంటారు.
అలాగే సింగపూర్ ప్రభుత్వంతో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని మధ్యలో వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో తిరిగి ఆ దేశంతో సంప్రదింపులు జరపాలని సీఆర్డీయే భేటీలో నిర్ణయించారు. గత ఒప్పందం ప్రకారం స్టార్టప్ ప్రాంతాన్ని సింగపూర్ అభివృద్ధి చేసేలా ప్రయత్నాలు చేస్తారు. అమరావతిని కనెక్ట్ చేస్తూ కృష్ణానదిపై ఆరు ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం చేపడతారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులు కూడా నిర్మించనున్నారు. అలాగే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును తిరిగిప్రారంభించాలని నిర్ణయించారు.
రైతులకు ప్రతి ఏటా ఇచ్చే కౌలు తో పాటు పెన్షన్లను మరో ఐదేళ్లు పొడిగించాలని సీఆర్డీయే అధారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంత మేర కౌలు అందుతుందో అంతే మేర నగదు, అలాగే ప్రస్తుతం అందుతున్న పెన్షన్ ను రాబోయే ఐదేళ్లకు చెల్లించేందుకు అధారిటీ నిర్ణయం తీసుకుంది. ఇదే విధంగా ప్రస్తుతం ఇస్తున్న మేరకే పింఛన్లను కూడా వచ్చే ఐదేళ్లు కొనసాగించనున్నారు.












Click it and Unblock the Notifications