ఛలో విజయవాడ విరమించుకున్నా ఉద్యోగుల అరెస్టులా ? ఎన్జీవోల ఆగ్రహం-రేపు విద్రోహ దినం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు రేపు తలపెట్టిన ఛలో విజయవాడను సెప్టెంబర్ 11కు వాయిదా వేసుకున్నారు. అయినా పోలీసులు మాత్రం ఉద్యోగుల్ని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం, బైండోవర్ చేయడం జరుగుతూనే ఉంది. దీనిపై ఏపీ ఎన్జీవోలు మండిపడుతున్నారు.
సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగుల్ని ప్రభుత్వం వేధించడం సరికాదని ఇవాళ ఏపీఎన్జీవోల సంఘం తెలిపింది. ఉద్యోగులపై పెట్టిన కేసుల్ని తక్షణం ఉపసంహరించుకోవాలని కోరింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు విద్రోహ దినంగా పాటిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం ప్రకటించింది. ఇందులో భాగంగా రేపు కలెక్టరేట్ల వద్ద నిరసన తెలుపుతామని ఎన్జీవో సంఘం వెల్లడించింది.

సీఎం జగన్ ఇంటి ముట్టడి కార్యక్రమం విరమించుకున్నట్లు ఇప్పటికే సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయని, అయినా ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తూ కేసులు పెట్టిస్తోందని ఏపీ ఎన్జీవోలు విమర్శించారు. ఇది అన్యాయమని ఎన్జీవోలు తెలిపారు. దీనికి నిరసనగా రేపు కలెక్టరేట్ల వద్ద విద్రోహ దినం పాటించడంతో పాటు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీ అమలయ్యే వరకూ తమ పోరాటం ఆగదని ఎన్జీవోలు ప్రకటించారు. సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకునే వరకూ ఉద్యమం కొనసాగుతుందని వారు హెచ్చరించారు.
సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. పలుదఫాలుగా చర్చలు జరిపినా అవి విఫలం కావడంతో ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం అరెస్టులకు దిగింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఈ కార్యక్రమం వాయిదా వేసుకున్న ఉద్యోగులు తిరిగి సెప్టెంబర్ 11న దీన్ని చేపడతామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వం కూడా వారిపై ఉక్కుపాదం మోపుతోంది.












Click it and Unblock the Notifications