APPSC : గ్రూప్-2,గ్రూప్-3 పోస్టులకు ప్రిలిమ్స్ రద్దు చేసే యోచనలో ఏపీపీఎస్సీ..?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2,గ్రూప్-3 పోస్టుల భర్తీ విషయంలో కీలక ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఈ రెండింటికీ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి... ఒకే పరీక్ష నిర్వహించాలని కమిషన్ భావిస్తోంది. గ్రూప్-1 పోస్టుల తరహాలో గ్రూప్-2,గ్రూప్-3 పోస్టులకు రెండు పరీక్షలు (ప్రిలిమ్స్,మెయిన్స్) నిర్వహించాల్సిన అవసరం లేదని... కేవలం ఒకే పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేయవచ్చునని కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా అభ్యర్థులపై ఒత్తిడి తగ్గుతుందని... ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.
నిజానికి గతంలో ప్రిలిమ్స్,మెయిన్స్ పరీక్షా విధానం కేవలం గ్రూప్-1 పోస్టులకే ఉండేది. గ్రూప్-2,గ్రూప్-3 పోస్టులకు ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరిగేది. కానీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రూప్-2,గ్రూప్-3 పోస్టులకు కూడా ఇదే విధానాన్ని వర్తింపజేశారు. దీంతో ప్రిపరేషన్కు ఎక్కువ రోజులు వెచ్చించాల్సి వస్తుండటంతో ఆర్థిక భారంతో పాటు ఒత్తిడి కూడా పెరిగింది. అదే సమయంలో కోచింగ్ సెంటర్లు కోచింగ్ పేరిట నిరుద్యోగులను దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ గ్రూప్-2,గ్రూప్-3 పరీక్షా విధానంలో మార్పులపై ఫోకస్ చేసింది.
విద్యార్థులపై ఒత్తిడి,ఆర్థిక భారం తగ్గించాలంటే గ్రూప్-2,గ్రూప్-3 పోస్టులకు ఒకే పరీక్ష నిర్వహించడం ఉత్తమమని కమిషన్ భావిస్తోంది. దీంతో కోచింగ్ సెంటర్ల దోపిడీకి కూడా తెరపడుతుందని భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంది.
ఇక రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం(జూన్ 18) విడుదల చేయనున్నారు. వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను ఇందులో వెల్లడించనున్నారు. మొత్తం 10,143 ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయనున్నారు. ఇందులో ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్లాగ్ 1,238 పోస్టులు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో 36 పోస్టులు, పోలీస్ శాఖలో 450 ఉద్యోగాలు, వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 451 పోస్టులు, పారామెడికల్ సిబ్బంది 5,251 పోస్టులు, నర్సులు 441 పోస్టులు, డిగ్రీ కాలేజీల లెక్చరర్లు 240 పోస్టులు, వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2,000 పోస్టులు, ఇతర శాఖలల్లో 36 పోస్టులు ఉండనున్నాయి.