రికార్డు ఉష్ణోగ్రతలు- ఇటు వర్షాలు, ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక వైపు రికార్డు స్థాయి లో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో వైపు వర్షాలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే రకమైన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండటంతో.. అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉండగా, ఉత్తరకోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ లోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
తాజా అలర్ట్
ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తాజా అలర్ట్స్ జారీ చేసింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, అల్లూరి జిల్లాలో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. ఆదివారం కడపలో 42.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా రావికమతం, కడప జిల్లా వేంపల్లెలో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురముండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీలు, 55 ప్రాంతాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఆరెంజ్ అలర్ట్
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కోమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు హెచ్చరిక లు జారీ అయ్యాయి. దీంతో ఆరేంజ్ అలెర్ట్ ఉన్న జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ రోజు గరిష్టంగా మెదక్ లో 42, కనిష్టంగా హైదరాబాద్ లో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలు స్తోంది. నిన్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, రామగుండం, ఖమ్మం, భద్రాచలం లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుము లు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా అలర్ట్స్ జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications