సీఎం జగన్ సమర్ధతకు సవాల్ గా : సమ్మెలోకి ఆర్టీసీ కార్మికులు - వైద్య ఉద్యోగులు సైతం...!!
ఏపీలో ఉద్యోగులు - ప్రభుత్వం మధ్య పీఆర్సీ రగడ కొలిక్కి రావటం లేదు. ఉద్యోగ సంఘాల నేతల సమక్షంలోనే సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించారు. అప్పుడు అందరూ హర్షం వ్యక్తం చేసారు. కానీ, ఇతరత్ర అంశాలతో కలిపి జీవోల జారీతో ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. వెంటనే నిరసన షెడ్యూల్ తో పాటుగా సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. ప్రభుత్వం మంత్రులతో సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేసింది. మూడు రోజుల పాటు కమిటీ వెయిట్ చేసినా ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు రాలేదు. తాము చర్చలకు రావాలంటే ముందుగా మూడు డిమాండ్లు పరిష్కరించాలని షరతు పెడుతున్నాయి.
జనవరి జీతాలపైనా టెన్షన్
దీని పైన ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు. ఎప్పటికైనా చర్చలతోనే ఈ సమస్య పరిష్కారం కావాల్సిందేనని పేర్కొన్నారు. అటు వైపు ప్రభుత్వం ఎన్ని సర్క్యులర్లు జారీ చేసినా.. జనవరి జీతాల విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఎలాగైనా జనవరి కొత్త జీతాలు ఫిబ్రవరి 1న విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, ట్రెజరీల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వేగంగా బిల్లుల ప్రక్రియ ముందుకు సాగటం లేదు. ఇదే సమయంలో మరి కొన్ని కీలక సంఘాలు సమ్మె బాట పడుతున్నాయి. తాజాగా, యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ నోటీసు అంద చేసింది.
వైద్య ఉద్యోగుల సమ్మె నోటీసు
వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాలతో పాటుగా జాతీయ ఆరోగ్య మిషన్ లో పని చేసే శాశ్వత..ఒప్పంద..సర్వీసు ప్రొవైడర్ల ఉద్యోగులు 6 అర్దర్రాత్రి నుంచి సమ్మెలో పాల్గొంటారని నోటీసులో స్పష్టం చేసారు. ఇక, ఇటు ప్రజా రవాణా వ్యవస్థపైన ప్రభావం చూపే ఆర్టీసీ కార్మికులు సైతం సమ్మె బాట పట్టేందుకు సిద్దం అవుతున్నారు. ఈ రోజున ఆర్టీసీ సంఘాల కీలక సమావేశం జగనుంది.
ఆర్టీసీలో ముఖ్యమైన ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్(ఎన్ఎంయూఏ), ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)తో పాటు మరో కీలక సంఘం ఏపీ పీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎ్ఫ)లు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ రోజు సమావేశం కానున్నాయి. తొలుత సంఘాల అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో తమ భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల నేడు ప్రకటన
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనే హామీలో భాగంగా సంస్థను ప్రజా రవాణా శాఖగా ఏర్పాటు చేసి ఆర్టీసీ ఉద్యోగులను అందులో విలీనం చేసారు. దాదాపు 52 వేల మంది ఉద్యోగులు ఈ శాఖలో ఉన్నారు. కేడర్ ఫిక్సేషన్.. సర్వీసు నిబంధనలు వంటి వాటి పైన సమ్మెకు వెళ్లాలని భావిస్తున్నారు.
యూనియన్ల అంతర్గత సమావేశం తరువాత మధ్యాహ్నం 12నుంచి 1గంట మధ్యలో సమావేశానికి హాజరు కావాలని పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేఆర్ సూర్యనారాయణ, కె.వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించారు. వారి సమక్షంలోనే సమ్మె లోకి వచ్చే అంశాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇలా.. వరుసగా కీలక శాఖలు ఒక్కొక్కటిగా సమ్మె బాట పడుతున్న వేళ...ఇది సీఎం జగన్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది.
సీఎం జగన్ సమర్ధతకు పరీక్షగా
తాను స్వయంగా చర్చించి.. అన్ని సంఘాలకు ప్రాధాన్యత ఇస్తూ వారితో చర్చించి 23 శాతం పీఆర్సీ ప్రకటించినా.. ఇలా ఉద్యోగ సంఘాల సమ్మె బాట పట్టటంతో సీఎం వేచి చూసే ధోరణితో ఉన్నారు. సీఎం నియమించిన మంత్రుల కమిటీతో చర్చలకు ఉద్యోగ సంఘాలు ముందుకు రావటం లేదు. ముందుగా ఆ జీవోల రద్దు... పాత జీతాల చెల్లింపు..అశుతోష్ మిశ్రా నివేదిక బయట పెట్టటం డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలంటూ తేల్చి చెబుతున్నారు. ఇటు ఉద్యోగుల పైన కఠినంగా వ్యవహరించవద్దని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. అటు ఉద్యోగ సంఘాలు మాత్రం సమ్మె ఖాయమని చెబుతున్నాయి. రోజు రోజుకీ గ్యాప్ పెరుగుతోంది.
సీఎం నిర్ణయం పైనే ఉత్కంఠ
సీఎం జగన్ ఇప్పుడు ఏం చేస్తారు..తానే స్వయంగా జోక్యం చేసుకుంటారా ..లేక, ఉద్యోగుల డిమాండ్ల పైన పునరాలోచన చేస్తారా.. లేక, జీతాలు చెల్లించిన తరువాత వాస్తవాలు వెల్లడవుతాయనే భావనతో ఆ తరువాతనే అంటే ఫిబ్రవరి 2వ తేదీ తరువాతనే సమాలోచనలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ముందుగా మాత్రం పెరిగిన జీతాలు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.
ఉద్యోగులు చెబుతున్నట్లుగా సమ్మె మొదలైతే మాత్రం...ఏపీలో ఆర్దికంగా.. రాజకీయంగా జగన్ ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ సమ్మె సీఎం సమర్ధతకు సవాల్ గా మారే పరిస్థితి కనిపిస్తోంది. మరి..ప్రభుత్వం సమ్మె నివారిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.