ఉచిత బస్సు సక్సెస్ కావాలంటే ? చంద్రబాబుకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్..!
ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకాన్ని ఇవాళ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. అయితే ఈ పథకం అమల్లో కీలకమైన ఉద్యోగుల పెండింగ్ సమస్యల విషయంలో మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో ఇప్పటికే ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులు.. ఇవాళ సీఎం చంద్రబాబును కలిసి మరోసారి తమ డిమాండ్లను ఆయన ముందు పెట్టారు. వీటిని వెంటనే పరిష్కరించాలని ఆయన్ను కోరారు.
ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తిని విజయవంతం చేస్తామని, అయితే తమ సమస్యల్ని మాత్రం పరిష్కరించాల్సిందేనని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు సీఎం చంద్రబాబుకు తేల్చిచెప్పారు. ప్రభుత్వ అనుమతి కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, అలాగే స్త్రీశక్తి పధకం విజయవంతం కావాలంటే 3000 కొత్త బస్సులు కొనుగోలుచేయాలని,అన్ని కేటగిరీలలో ఖాళీలు భర్తీ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికల్ సిబ్బంది , ఇతర విభాగాలలో ఉన్న 10వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వాలి చంద్రబాబును కోరారు.

వీటితో పాటు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్న 11వ పీఆర్సీ పెండింగ్ 24 నెలల అరియర్స్, డిఏ బకాయిలు, కొత్త డిఏలు వెంటనే ప్రకటించాలని వారు సీఎంను కోరారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, ఆర్టీసీ ఉద్యోగులకు విలీనం కాక ముందున్నపాత విధానంలో వైద్య సౌకర్యాలు పునరుద్ధరించాలని, ఇ.హెచ్.యస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయం అందేలా చూడాలని కూడా కోరారు.

ఆర్టీసిలో మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులలో ఒకరికీ ఉద్యోగావకాశం కల్పించాలని, ఆర్టీసిలో ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో అవకాశం కల్పించాలని, ఔట్ సోర్శింగు ఉద్యోగులకు ఆప్కాస్ లో ఉన్న ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచాలని, ఆన్ కాల్/అద్దెబస్సు డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలిశెట్టి దామోదరరావు లేఖలో విజ్ఞప్తి చేసారు.అంతే కాకుండా ప్రభుత్వ పరిధిలో పరిష్కారం కావాల్సిన సమస్యలలో మరో 15 సమస్యలను కూడా జోడించి వీటిని పరిష్కారించాలని లేఖ ద్వారా సీఎంను కోరారు.












Click it and Unblock the Notifications