ఉచిత బస్సు ప్రయాణం లో కీలక మార్పు, ఇక నుంచి కొత్తగా - ఇవి తప్పనిసరి..!!.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ పథకం అమలు నిరంతరం సమీక్షిస్తోంది. రికార్డు స్థాయిలో మహిళలు ఈ పథకం సద్వినియోగం చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. మహిళల నుంచి వస్తున్న స్పందన మేరకు తాజా గా ఈ పథకం మరిన్ని బస్సులకు వర్తింప చేసేందుకు రంగం సిద్దం అవుతోంది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు కీలక ప్రకటన చేసారు.
ఏపీలో స్త్రీ శక్తి పథకం కు ఆదరణ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయిదు కేటగిరీల బస్సుల్లోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తొలుత ఘాట్ రోడ్ల సర్వీసుల్లో అమలు చేయలేదు. ఆ తరువాత లబ్దిదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు ఘాట్ రోడ్ల సర్వీసుల్లోనూ అమలు చేస్తున్నారు. ఉచిత ప్రయాణం బస్సులను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

అదే విధంగా ఈ బస్సులకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. కాగా.. ఈ పథకం మరిన్ని బస్సులకు విస్తరించి అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. ఇప్పటివరకు సాధారణ సర్వీసుల్లో మాత్రమే అమలవుతున్న ఈ పథకాన్ని, త్వరలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్న ఈ పథకం అమలుకు మరిన్ని నిర్ణయాలను తీసుకుంటున్నట్లు ఎండీ ద్వారకా తిరుమల రావు వివరించారు. పట్టణాలు, గ్రామాల మధ్య నడిచే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,050 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే సేవలోకి తీసుకురాబోతున్నామని చెప్పారు.
వీటిలో 300 తిరుపతికి, మిగిలిన 700 బస్సులు రాష్ట్రంలోని 13 ప్రాంతాలకు కేటాయించనున్నట్లు వివరించారు. స్త్రీశక్తి పథకం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజూ లక్షలాది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు. అదే సమయంలో ప్రయాణీకుల సదుపాయాలను పెంచుతున్నామని వివరించారు. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని అన్ని బస్టాండ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సీట్లు వంటి సదుపాయాలను మెరుగుపర్చేలా కార్యాచరణ అమలు చేస్తున్నామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications