కన్నుల పండుగగా సాగుతున్న అరకు బెలూన్ ఫెస్టివల్
నవంబర్ 14 న అరకులోయలో ప్రారంభమైన బెలూన్ ఫెస్టివల్ 16 వ తారీఖు వరకు జరగనుంది. ఈ వేడుకల్లో ఆస్ట్రేలియా, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ తో సహా 13 దేశాలకు చెందిన 16 బెలూన్ పైలట్లు పాల్గొంటున్నారు.
Recommended Video
విశాఖ: అందాల అరకు లోయ మరో అరుదైన వేడుకకు వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తలపెట్టిన బెలూన్ ఫెస్టివల్ కన్నుల పండుగగా సాగుతోంది. పర్యాటకుల్ని ఆకర్షించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అరకు లోయలో ఈ బెలూన్ ఫెస్టివల్ ని పర్యాటకశాఖ నేతృత్వంలో ఈ-ఫ్యాక్టర్ సంస్థ నిర్వహిస్తోంది.
వివిధ దేశాల పైలట్ల రాక...
నవంబర్ 14 న ప్రారంభమైన ఈ ఫెస్టివల్ 16 వ తారీఖు వరకు జరగనుంది. ఈ వేడుకల్లో ఆస్ట్రేలియా, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ తో సహా 13 దేశాలకు చెందిన 16 బెలూన్ పైలట్లు పాల్గొంటున్నారు. పోటీల్లో భాగంగా కొన్ని బెలూన్లను 5 వేల అడుగుల ఎత్తు వరకు తీసుకువెళతారు. ఈ బెలూన్ రెయిడ్స్లో పాల్గొన దలచిన వారు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్న ఈ-ఫ్యాక్టర్ సంస్థ సూచనతో ఇప్పటిదాకా దాదాపు 6500 మంది వరకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో లాటరి ప్రక్రియ ద్వారా ప్రయాణికులను ఎంపిక చేసి రోజుకు 300 మందిని ఉచితంగా బెలూన్లలో విహరించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు పర్యటక శాఖ అధికారులు చెప్పారు.
అతిథులకు ఏర్పాట్లు...
ఈ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు పైలట్లు కొంతమంది హెలికాప్టర్లోనూ, మరికొందరు రోడ్డు మార్గంలోనూ సోమవారం సాయంత్రానికి అరకులోయకు చేరుకున్నారు. వీరికి అరకులోయ సమీపంలోని దళపతిగూడ వద్ద 50 గుడారాలతో పాటు అక్కడే కాన్ఫరెన్స్, డైనింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు రెయిడ్స్ ఉంటాయి. బెలూన్ రెయిడ్స్ కోసం అరకు సమీపంలోని సుంకరమెట్టను ఎంపిక చేశారు. అక్కడ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపగూడ వరకు బెలూన్ రెయిడ్ జరుగుతుంది.
ప్రతికూల పరిస్థితులతో కొంత నిరాశ...
అయితే ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా తలపెట్టిన ఈ బెలూన్ ఫెస్టివల్ ను ప్రతికూల పరిస్థితులు దెబ్బతీశాయి. ముందుగా అరకులోయలో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో భారీ మొత్తం వెచ్చించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వేడుక ప్రారంభ సమయానికి తీవ్ర అల్పపీడనం ఏర్పడటం, బలమైన గాలులకు చిరుజల్లులు తోడవడం ఈ ఫెస్టివల్ కు ప్రధాన ప్రతిబంధకంగా మారింది.
మరోవైపు అగ్రి హ్యాకథాన్
ఇంకోవైపు విశాఖలో అగ్రిహ్యాకథాన్కు ఉప రాష్ట్రపతి వస్తున్నారన్న కారణంతో ప్రముఖులు ఈ ఫెస్టివల్ కు హాజరు కాలేని పరిస్థితి. మరోవైపు కృష్ణా నదిలో బోటు ప్రమాదంతో పర్యాటక శాఖ పరువు పోయిన స్థితిలో ఈ బెలూన్ ఫెస్టివల్ పై దృష్టి సారించలేని స్థితి...వెరసి ఇవన్నీ అరకు బెలూన్ ఫెస్టివల్ కొంత చిన్నబోయేలా చేశాయి.