జగన్కు టోకరా: చంద్రబాబుతో భేటీకి ఎంపి గీత రెడీ
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ నాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్న అరకు లోక్సభ సభ్యురాలు గీత వచ్చే వారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. చంద్రబాబు అప్పాయింట్మెంట్ కోరుతూ గీత ఆయనకు లేఖ రాసినట్లు సమాచారం.
అరకు నియోజకవర్గం అభివృద్ధి పేరుతో చంద్రబాబును కలవాలనుకుంటున్న గీత పలు ఇతర అంశాలపై ఆయనతో చర్చలు జరుపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసులో సరైన గౌరవం లభించటం లేదని బాధపడుతున్న గీత తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయని కొంతకాలం నుండే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో గీత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ కోరటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. గిరిజనులు అధికంగా నివసించే అరకు లోక్సభ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వాధి నేతలతో చర్చలు జరపవలసిన అవసరం ఎంతో ఉన్నదని గీత భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయ, సహకారాలుంటేనే నియోజకవర్గం అభివృద్ది చెంది, గిరిజనుల బతుకులు కొంతైనా బాగుపడతాయన్నది ఆమె వాదన.
చంద్రబాబుతో జరిగే భేటీలో నియోజకవర్గం సమస్యలతోపాటు రాజకీయాంశాలు కూడా చర్చకు వస్తాయని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గీత ఆయన కార్యాలయంలో పని చేశారు. గీత తనంత తానుగా వైయస్సార్ కాంగ్రెసు నుంచి తప్పుకోకుండా తనపై చర్య తీసుకునేలా చేయటమే ఆమె లక్ష్యంగా కనిపిస్తోందని మరో వాదన వినిపిస్తోంది.
గీతతోపాటు కర్నూలు లోక్సభ సభ్యురాలు బుట్టా రేణుక కూడా పార్టీ అధినాయకత్వం తీరుపట్ల అసంతృప్తితో ఉన్నారు. నంద్యాల ఎంపి ఎస్పివై రెడ్డి ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరారు. రేణుక, గీతతో పాటు మరో ఇద్దరు లోక్సభ సభ్యులు కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications