నాలుక కోసినా, కాళ్లు విరగ్గొట్టినా: అశోక్ బాబు, వివరణ
హైదరాబాద్: నాలుకలు కోసినా, కాళ్లు విరగ్గొట్టినా తాము సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు బుధవారం స్పష్టం చేశారు. నాలుకలు కోస్తే మూగవాళ్లుగా, కాళ్లు విరగ్గొడితే వికలాంగులుగా తాము తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. తాను తెలంగాణ వారిని రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తమ ప్రసంగాలను ఎవరు వక్రీకరించవద్దని కోరారు.
తాను ఎప్పుడు, ఎవరిని కించపర్చలేదని చెప్పారు. ఒకవేళ తమ ప్రసంగంలో తప్పులు దొర్లితే చర్చలతో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు తాము చేయలేదని చెప్పారు. హింసను ప్రేరేపించే మాటల వల్లనే తమ ప్రాంతంలో ప్రజలు ఉద్వేగానికి లోనవుతున్నారని చెప్పారు. తెలంగాణ తెలుగు సంస్కృతిలో ఓ భాగమే తప్ప వేరు కాదని తెలుసుకోవాలన్నారు.
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీల రాజీనామాలు ఎంత అవసరమో ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా ఉండటం అంతే అవసరమన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించేందుకు అసెంబ్లీ నుండి ఎవరు రాజీనామా చేయవద్దన్నారు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
ఎపిఎన్జీవో కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ జాగృతి
హైదరాబాదులోని ఎపిఎన్జీవో కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి కార్యకర్తలు బుధవారం ఉదయం ముట్టడించారు. హైదరాబాదుపై అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వారు ముట్టడించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.