పదేళ్ల వరకు ఉండం.. తొందరగా వెళ్తామన్న అశోక్బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో పని చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు శుక్రవారం చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినందున తమ ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఉద్యోగులు కూడా భావిస్తున్నారని, కొందరికి పిల్లల చదువు, మరికొందరికి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చునని అన్నారు. కొత్త రాజధానిని నిర్మించుకునే క్రమంలో వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారన్నారు.
పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారని, అప్పటి వరకు ఇక్కడే ఉండేందుకు ఆసక్తి లేదన్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమివ్వాలంటూ ఏ రాజకీయ పార్టీనీ తాము కోరలేదన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి లేదా ఎపిఎన్జీవో నేతలెవరైనా ఏ పార్టీనుంచైనా పోటీ చేస్తే వారికి మాత్రం మద్దతిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తలను అశోక్ బాబు కొట్టిపారేశారు.
ఉద్యోగుల భద్రత, విద్యార్థుల ప్రయోజనాల విషయమై పార్టీలు తమ మేనిఫెస్టోల్లో తప్పనిసరిగా పొందుపర్చాలని సూచించారు. కొందరు స్వార్థపరుల కోసం మళ్ళీ రాజధాని చుట్టూనే అభివృద్ధి అంటే మళ్లీ విభజనోద్యమాలు తప్పవన్నారు. పదమూడు జిల్లాలు కూడా అభివృద్ధి చెందేలా రాజధాని ఎంపిక జరగాలని అభిప్రాయపడ్డారు. ఎపిఎన్జీవో ఐకాసను వచ్చే వారంలో పునర్నిర్మించనున్నామని, దాని ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై పోరాటం చేస్తామన్నారు.
తెలంగాణ నేతలు కొందరు చెబుతున్న మాటలపట్ల భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఫెయిర్ షేర్, అవసరాలను బట్టి ఉద్యోగుల పంపిణీ జరగాలి తప్ప, సర్ప్లస్ లేదా షార్టేజీ పేరుతోనో పంపిణీ జరిగినపక్షంలో ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఆప్షన్ ఉండాల్సిందేనని చెప్పారు. ఉద్యోగ పంపకాల్లో తమకు న్యాయం కావాలన్నారు. ఓటర్ల మనస్తత్వం తెలుసుకోవడం అంత తేలిక కాదని చెప్పారు. సమైక్య ఉద్యమంలో పాల్గొన్న వారికి ఏ పార్టీ అయినా టిక్కెట్లు ఇస్తే మద్దతిస్తామన్నారు.