వారికి జైలంటే చాలా ఇష్టమేమో: విజయసాయి రెడ్డికి అశోక్ గజపతిరాజు స్ట్రాంగ్ కౌంటర్
విజయనగరం: తనపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. విజయనగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్, బోర్డు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే, ట్రస్ట్ ఆనవాయితీలను పాటించే విషయంలో అడ్డు రాకూడదని అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులగా అందరూ మహిళలనే తీసుకుంటే ఎవరైనా కాదన్నారా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డులకు తాము ఏ మాత్రం వ్యతిరేకం కాదని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. ట్రస్ట్ పేరు చెప్పి కొంతమంది టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో? ఎందుకు విడిచిపెట్టారో? ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే ఉందన్నారు. ట్రస్ట్ విషయంలో వైసీపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు అర్థరహితంగా ఉందని దుయ్యబట్టారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ట్రస్ట్ భూములపై ఎక్కువ దృష్టిపెట్టినట్లు అనిపిస్తుందని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. ఎప్పుడు మాట్లాడినా తనను జైలుకు పంపిస్తానని అంటున్నారని.. బహుశా బెయిల్పై వచ్చిన పెద్దలకు జైలు అంటే చాలా ఇష్టం అనుకుంటానంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
విజయసాయి రెడ్డి ఏమన్నారంటే..
అశోక్ గజపతి రాజు ధర్మకర్తనా .. అధర్మకర్తనా అంటూ విమర్శలు చేసిన విజయసాయి రెడ్డి మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం ఆస్తుల దుర్వినియోగంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఎక్కడ డిబేట్ పెట్టినా తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని, నువ్వు సిద్ధమైతే రా అంటూ ఛాలెంజ్ చేశారు విజయసాయిరెడ్డి.
Recommended Video
దేవుడి ఆస్తులు కొల్లగొట్టడం లో అశోక్ గజపతిరాజు పాత్రపై అనుమానాలను వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి ఈరోజు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న తర్వాత అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మొదటి నుండి మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేస్తున్న సాయి రెడ్డి ఎనిమిది వందల నలభై ఎకరాల దేవస్థానం భూమి గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైనదని మండిపడ్డారు. దేవస్థానం భూములు అన్యాక్రాంతం అవుతుంటే ధర్మ కర్తలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. 8 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తి పరాధీనం పాలైతే ఏం చేస్తున్నారని నిలదీశారు. ధర్మకర్తలు ధర్మానికి కట్టుబడి సంప్రదాయాలను కొనసాగించాలని స్పష్టం చేశారు.
అశోక్ గజపతిరాజు బయటకు నీతులు చెబుతున్నాడని లోపల కుట్రలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ అశోక్ గజపతిరాజు ధర్మకర్త నా, లేకా అధర్మ కర్తనా అంటూ విరుచుకుపడిన సాయి రెడ్డి మాన్సాస్ ట్రస్ట్ లో అక్రమాలకు అశోక్ గజపతినే బాధ్యుడని విమర్శించారు. తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు విజయసాయిరెడ్డి. గత ప్రభుత్వ హయాంలో సింహగిరిపై అనేక అక్రమాలు జరిగాయని విమర్శించారు. త్వరలోనే పంచ గ్రామాల భూ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.