అసెంబ్లీ జబర్దస్త్ షో కాదు: రోజాపై టిడిపి ఘాటు వ్యాఖ్య
కడప/ గుంటూరు/ కర్నూలు: శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్కు గురైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, పౌర సరఫరాల చైర్మన్ లింగా రెడ్డి ఘాటు వ్యాఖ్య చేశారు. అసెంబ్లీ జబర్దస్త్ షో కాదని రోజా గుర్తించాలని ఆయన సోమవారం మీడియాతో అన్నారు.
గత ప్రభుత్వ లోపాలు బయటపడతాయనే అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ వాకౌట్ చేశారని లింగారెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా జగన్ వాకౌట్ ఆయన తప్పు పట్టారు.
యానిమల్ హాస్టల్
ఇదిలావుంటే, గ్రామ కూడళ్లలో యానిమల్ హాస్టల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. రైతులు ఫిషరీస్, హార్టీకల్చర్ వంటి వాటిపై దృష్టిపెట్టేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
నాణ్యత లోపిస్తే సహించం
చందన్న కానుకల్లో నాణ్యతలోపిస్తే చర్యలు తప్పవని మంత్రి పరిటాల సునిత హెచ్చరించారు. సోమవారం ఆమె కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ-పాస్ విధానం బియ్యం అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. ఈపాస్ విధానంలోని సాంకేతిక సమస్యలను తొలగించి, అర్హులందరికీ చంద్రన్న కానుకలు అందజేస్తామని సునీత చెప్పారు.