అసెంబ్లీ: టీ బిల్లుపై తెరాస వినతి, శ్రీధర్ బాబు రిప్ల్టై
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాలం సమావేశాలు రేపు (గురువారం) ప్రారంభం కానున్నాయి. సమావేశాలను ఏడు పనిదినాలు నిర్వహించాలని శాసనసభ బిఎసి సమావేశంలో నిర్ణయించారు. రేపు దక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్ మండేలాకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది. తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిన వెంటనే శాసనసభలో పెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ సమావేశంలో కోరారు. తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిన అనంతరం మరోసారి శాసనసభ సలహా సంఘం (బిఎసి) సమావేశం అవుతుందని శాసనసభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు చెప్పారు.
రాష్ట్ర శాసనసభకు ముసాయిదా బిల్లు మాత్రమే వస్తున్నందున దానిపై తీర్మానం అవసరం లేదని శ్రీధర్ స్పష్టం చేశారు. శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోరింది. ఈ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెసు శోభా నాగిరెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగినట్లు సమాచారం.
స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన సలహా సంఘం (బిఎసి) సమావేశంలో ఎజెండాను ఖరారు చేశారు. తుఫాను, వరద నష్టాలపై, కృష్ణాజలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎస్సీఎస్టీ ప్రణాళికపై కూడా చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు.
తాము చర్చ కోసం ఇచ్చిన అంశాలను వేటినీ ఎజెండాలో చేర్చడానికి ముందుకు రాలేదని తెలుగుదేశం శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చే వరకు ప్రజా సమస్యలపై చర్చించాలని తాము కోరినట్లు ఈటెల రాజేందర్ చెప్పారు. శాంతిభద్రతలపై, ప్రమాదాలపై కూడా చర్చించాలని తాము కోరామని ఆయన చెప్పారు. విద్యుత్తు చార్జీల భారంపై చర్చించాలని తెలుగుదేశం పార్టీ కోరింది. మూడు రోజుల పాటే సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే, కనీసం పదిరోజులైనా జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఏడు పని దినాలు సమావేశాలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది.