అసెంబ్లీ నుంచి వైకాపా వాకౌట్: విజయమ్మ ప్రశ్నలు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు శుక్రవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. పలు ప్రశ్నలు గుప్పిస్తూ, నిరసన వ్యక్తం చేస్తూ తాము వాకౌట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వైయస్ విజయమ్మ చెప్పారు. ఆ తర్వాత ఆ పార్టీ సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ సభను విడిచిపెట్టి వెళ్లారు. ఈ రోజు కోసం తాము వాకౌట్ చేస్తున్నట్లు విజయమ్మ చెప్పారు.
సమైక్య తీర్మానానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇవ్వగలరా అని ఆమె అడిగారు. బిల్లులో ప్రధానాంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని ఆమె విమర్శించారు. ఒక ప్రాంతంలో సెంటిమెంటును రెచ్చగొట్టి ఆ ప్రాంతంలోని ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నించారని ఆమె విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీని పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అన్నారు.

అంతకు ముందు శుక్రవారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించినట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.
అందుకు ప్రతిగా తెలంగాణ సభ్యులు తెలంగాణకు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందర గోళం చోటు చేసుకుంది. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఝప్తి చేసినా సభ సద్గుమణగ లేదు. దాంతో సభను స్పీకర్ అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు సభ నుంచి వాకౌట్ చేసింది.
చర్చ జరగకుండా ఓటింగు పెట్టాలని అడగడం సరి కాదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులకు బిఎసిలోనే ఆ మేరకు స్పష్టత ఇచ్చానని ఆయన చెప్పారు. చర్చకు ముందే ఓటింగ్ పెట్టాలని అడగడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications