ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: మమత ఎఫెక్ట్, అమరావతిలోని చంద్రబాబు 'భారీ' ప్లాన్
కోల్కతా/అమరావతి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో విపక్షాలు ఏకమయ్యాయి. దాదాపు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తాయి. మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీకీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, మల్లికార్జున ఖర్గే, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి, శతృఘ్ను సిన్హా, యశ్వంత్ సిన్హా, తేజస్వి యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ భారీ ర్యాలీని నిర్వహించిన మమతను ఫరూక్ అబ్దుల్లా సహా అందరూ అభినందించారు.
ఈ ర్యాలీకి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ హాజరు కాలేదు. కానీ వారి తరఫున ఖర్గే వెళ్లారు. సోనియా సందేశం పంపించారు. మాయావతి వెళ్లకపోయినప్పటికీ తమ తరఫున కీలక నేతను పంపించారు. మొత్తానికి ఈ ర్యాలీ అద్భుత విజయం సాధించిందని విపక్ష నేతలు చెబుతున్నారు.
ఏపీ తరఫున అందరికీ చంద్రబాబు ఆహ్వానం
కోల్కతా ర్యాలీ క్రెడిట్ మొత్తం మమతా బెనర్జీకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో ఇలాంటి భారీ ర్యాలీని ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కోల్కతా ర్యాలీలో స్వయంగా చెప్పారు. నాడు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు తొలి సమావేశం విజయవాడలో పెట్టి రెండో మీటింగ్ కోల్కతాలో వెట్టారని, అదే విధంగా తాము మిత్రపక్షాల తదుపరి సమావేశం అమరావతిలో భారీఎత్తున సభ నిర్వహించాలనుకుంటున్నామని, ఏపీ ప్రజల తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు.
కొత్త ప్రధాని రావడం ఖాయం
రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా కొన్ని హామీలు ఇచ్చిందని, ప్రత్యేక హోదా ఇస్తామని సభాముఖంగా చెప్పారని, కానీ ఈ ప్రభుత్వం కనీస సాయం చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. ఒక్క ఏపీ విషయంలోనే కాకుండా ప్రతి ఒక్కరికీ అన్యాయం చేస్తున్నారని, ఈ బహిరంగ సభ మోడీ పతనానికి ఆరంభం అన్నారు. 2019లో దేశానికి కొత్త ప్రధాని రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ వేదికపై ఉన్న నాయకులం అందరం దేశం ముందు, వ్యక్తులు తర్వాత అన్న నినాదంతో ముందుకెళ్తున్నామని, దేశం, ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరూ చేతులు కలిపి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!
కోల్కతా ర్యాలీ క్రెడిట్ అంతా మమతా బెనర్జీ ఖాతాలోకి వెళ్తుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలోని నిర్వహిస్తే ఏపీలోని నిర్వహించాలని చంద్రబాబు భావించడం వెనుక ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా కారణం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా మోడీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్నాయనే సందేశాన్ని దేశానికి ఇవ్వడంతో పాటు ఏపీలోను ఆ భారీ బహిరంగ సభ ప్రభావం ఉంటుందని భావిస్తుండవచ్చునని అంటున్నారు. ఇలాంటి సభ అమరావతిలో నిర్వహిస్తే అది వైయస్సార్ కాంగ్రెస్, జనసేనలపై రాష్ట్రంలో వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముందని, ముఖ్యంగా వైయస్ జగన్ పైన ప్రభావం చూపవచ్చునని భావిస్తుండవచ్చునని అంటున్నారు. ఈ భారీ సభతో రాష్ట్ర ప్రజలను కూడా తమ వైపు తిప్పుకోవచ్చునని భావిస్తుండవచ్చునని అంటున్నారు. చంద్రబాబు శుక్రవారం రాత్రే కోల్కతా వెళ్లి, ఆ రోజు రాత్రి, శనివారం ఉదయం నేతలను కలిశారు.
అమరావతిలోనే కాదు, ఆ తర్వాత వరుస సభలు
శనివారం కోల్కతాలో నిర్వహించిన భారీ సభ లాంటిది అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లోను నిర్వహించాలని విపక్షాలు నిర్ణయించాయి. ఆ తర్వాత ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో నిర్వహించాలనుకుంటున్నారు. కోల్కతా ర్యాలీలో చంద్రబాబు మాట్లాడుతూ... తదుపరి సభ అమరావతిలో నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కుమారస్వామిలు వరుసగా ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో నిర్వహిస్తామని చెప్పారు. తదుపరి సమావేశం అమరావతిలో లేదా ఢిల్లీలో ఉండే అవకాశముంది.