వనజాక్షిపై ఎమ్మెల్యే దాడి: రెవెన్యూ స్టాఫ్ ఆందోళన, అశోక్బాబుపై ఒత్తిడి
విజయవాడ: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచురులు దాడి చేశారనే ఆరోపణపై వివాదం ముదురుతోంది. కృష్ణా జిల్లా రెవెన్యూ ఉద్యోగులు గురువారం ఆందోళనకు దిగారు. చింతమనేనిపై, ఇతరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రేపటి లోగా చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళనను రేపటి నుంచి తీవ్రతరం చేస్తామని, తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు. కాగా, ఈ సంఘటనపై ఎపి ఎన్జీవో నాయకుడు పి. అశోక్ బాబుపై ఒత్తిడి పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటనపై అశోక్ బాబు స్పందించాలని కాంగ్రెసు నాయకుడు మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. దీంతో అశోక్ బాబు స్పందించాల్సిన పరిస్థితి ఎదురు కావచ్చునని అంటున్నారు.

కాగా, వనజాక్షికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అండగా నిలుస్తోంది. ఎమ్మార్వోపై దాడి అమానుషమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హైదరాబాదులో అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం స్వేచ్ఛగా విధులు నిర్వహించే వాతావరణం లేదని ఆయన మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం చినరాజప్ప స్పందించకపోవడం దారుణమని ఆనయ అన్నారు. ఎమ్మార్వో వనజాక్షికి తమ పార్టీ సంఘీభావం తెలుపుతోందని ఆయన అన్నారు. ఈ దాడికి కారణమైన ఎమ్మెల్యే సహా బాధ్యులందరిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications