పుట్టపర్తిలో అస్ట్రేలియా మహిళ హత్య: వీడిన మిస్టరీ

అయితే ఎస్పీ ఎస్వి రాజశేఖరబాబు పక్కాగా విచారణ చేయించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు ను ఎస్పీ తీవ్రంగా పరిగణించడంతో ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగి ఈ కేసుతో ప్రమేయం ఉన్న పుట్టపర్తిలోని సాయిగౌరీ అపార్టుమెంట్ వాచ్మెన్గా నంజప్ప గారి భగవంతుడు, సత్యసాయిని వాస్ అపార్టుమెంట్ వాచ్మెన్ బోయ పోతులయ్య, కొత్తచెరువుకు చెందిన సుమో డ్రైవర్ ఎం.నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ ఏడాది జూలై 22వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన లడ్గేట్ టోనీ బెరిలి అన్నే (75) భారతదేశానికి వచ్చింది.ఆగస్టు 14వ తేదీ పుట్టపర్తిలోని కర్నాటక నాగేపల్లి క్రాస్ రోడ్డులో ఉన్న సాయిగౌరీ అపార్టుమెంట్కు వెళ్లింది. ఆ అపార్టుమెంట్లో కొత్తచెరువు మండలం తలమర్ల గ్రామానికి చెందిన నంజప్పగారి భగవంతుడు వాచ్మెన్గా పని చేస్తున్నాడు. దీంతో ఆమె ఇతడిని సంప్రదించి సదరు అపార్టుమెంట్లో తాత్కాలికంగా ఆరు నెలల పాటు అద్దె కోసం ఓ గది కావాలని అడిగింది. దీంతో అతను ఆమె నుంచి రూ. 30 వేలు తీసుకుని ఆ అపార్టుమెంట్లోని 304వ నెంబర్ గదిని అద్దెకు ఇచ్చాడు.
అయితే తన యజమాని అయిన సలెల్ భటియాకు రూ. 10 వేలు మాత్రమే ఇచ్చి మిగతా రూ. 20 వేలు అతడు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆ గది అసౌకర్యంగా ఉందని ఇప్పటి వరకూ ఉన్న రోజులకు అద్దె పట్టుకుని అడ్వాన్స్లో మిగిలిన సొమ్ము తిరిగి ఇవ్వాలని ఆగస్టు 26వ తేదీ ఆమె వాచ్మెన్ను అడిగింది. అయితే వాచ్మెన్ అదే అపార్టుమెంట్లో మంచి సౌకర్యాలు కలిగిన మరో గది ఇస్తానని చెప్పగా అందుకు ఆమె నిరాకరించి తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని మరోసారి అడిగింది. అపార్టుమెంట్ యజమానికి తెలియకుండా వాడిన రూ. 20 వేల విషయంలో ఆస్ట్రేలియా దేశస్థురాలు తనను ఇబ్బంది పెడుతోందని భావించిన వాచ్మెన్ తన స్నేహితుడు, అదే ప్రాంతంలో ఉంటున్న సాయినివాస్ అపార్టుమెంట్ వాచ్మెన్ బోయ పోతులయ్య దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారిద్దరు ఆమెను హతమార్చి రూ. 20 వేలను చెరి సగం పంచుకుందామని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఆగస్టు 29వ తేదీ తన గదిలో నీటి కుళాయి లీకవుతోందని, మరమ్మతులు చేయాలని ఆమె వాచ్మెన్ను కోరింది. ఇదే అదనుగా భావించిన భగవంతుడు పోతులయ్యతో కలిసి ఆమెను హతమార్చేందుకు పథకం వేశారు. వీరు అదే రోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఆమె ఉంటున్న గదికి వెళ్లారు. పథకం ప్రకారం తొలుత పోతులయ్య ఆమె వద్దకు వెళ్లి గొంతు బిగపట్టగా, భగవంతుడు ఆమె నోరు, ముక్కు మూసి హతమార్చారు. అనంతరం ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్, రూ. 3500 నగదు తీసుకుని పోతులయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. భగవంతుడు మాత్రం యథా ప్రకారంగానే గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. పథకం ప్రకారం అదే రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో భగవంతుడు బావమరిది అయిన సుమో డ్రైవర్ నాగరాజు మరో ముగ్గురు కలిసి సమోతో సహా అక్కడికి చేరుకున్నారు.
వృద్ధురాలి శవాన్ని ఓ దుప్పటిలో చుట్టి సుమోలో వేసుకుని కొత్తచెరువు మండలం మరకుంటపల్లి గ్రామ పొలాల్లోకి తీసుకెళ్లి పాతిపెట్టి పరారయ్యారు. ఇలా అంతా పూర్తి అయిందనుకున్న భగవంతుడు సెప్టెంబర్ 14వ తేదీ పుట్టపర్తి అర్బన్ పోలీసుస్టేషన్కు వెళ్లి తమ అపార్టుమెంట్లోని 304 నెంబర్ గదిలో ఉంటున్న విదేశీయురాలు కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. అలాగే దేశంలోని పలు ఇమ్మిగ్రేషన్ కేంద్రాలకు, ఆస్ట్రేలియా దేశపు రాయబారి కార్యాలయాలకు సదరు మహిళ వివరాలు పంపుతూ ఆమె భారతదేశం విడిచి విదేశాలకు వెళ్లిందా అంటూ ఆరా తీశారు.
సదరు మహిళ కుటుంబ సభ్యులు, బంధువుల సమాచారం మేరకు ఆమె భారతదేశంలోనే ఉన్నట్లు రాయబారి కార్యాలయం నుంచి జిల్లా పోలీసు శాఖకు సమాచారం అందింది. దీంతో ఎస్పీ ఈ కేసును తీవ్రంగా పరిగణించి ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. ఇదే పనిలో నిమగ్నమైన పోలీసులు అందిన సమాచారం శుక్రవారం భగవంతుడు, నాగరాజు, పోతులయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆస్ట్రేలియా దేశస్థురాలిని హతమార్చి పూడ్చిపెట్టినట్లు వెల్లడి కావడంతో సదరు సమాచారాన్ని ఆ దేశపు రాయబారి కార్యాలయానికి జిల్లా పోలీసు శాఖ చేరవేసింది. కొత్తచెరువు మండలం మరకుంటపల్లి గ్రామ పొలాల్లో పూడ్చిపెట్టిన ప్రాంతంలో శవాన్ని వెలికితీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిసింది. పుట్టపర్తి డీఎస్పీ, తహశీల్దార్, ఆస్ట్రేలియా దేశపురాయబారి కార్యాలయం ప్రతినిధుల సమక్షంలో ఖననం చేసిన శవాన్ని వెలికి తీయనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications