రాజధానికి అథారిటీ, చైర్మన్గా సీఎం: చిక్కులే..!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ)ను ఏర్పాటు చేయనుంది. ఈ అథారిటీకి ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరించే అవకాశముంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్వీనర్గా ఉండవచ్చని తెలుస్తోంది.
హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ మాదిరిగా విజయవాడ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి, తీసుకున్న నిర్ణయాల అమలుకు అవసరమైతే చట్టాలకు సవరణ చేయనున్నారు. ల్యాండ్ పూలింగ్, టౌన్ప్లానింగ్లో భాగంగా ఈ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఈ అథారిటీ విధి విధానాలు, మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలోని అధికారులు నిమగ్నమై ఉన్నారు.
7063 చ.కి.మీ ఉన్న విజిటిఎంలో భూమి సేకరణకు నాలుగు మార్గాలను అనుసరించనున్నట్లుగా తెలుస్తోంది. భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలా లేదా ల్యాండ్ పూలింగ్ లేదా టౌన్ ప్లానింగ్ లేదా భూసేకరణ నిమిత్తం రైతులతో బేరసారాలు, మంతనాలు చేయడం లాంటి పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. భూసేకరణ చట్టానికి లోబడి జరగాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కడ బెడిసి కొట్టినా రైతులు కోర్టుకు వెళ్లే ప్రమాదముంది.

ల్యాండ్ పూలింగ్ అంటే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇవ్వాలి. ఒక వేళ రైతులు స్వచ్ఛందంగా ఇవ్వని పక్షంలో టౌన్ ప్లానింగ్ చట్టాన్ని రూపొందించి అమలు చేస్తారు. ఈ చట్టానికి శాసనసభలో సవరణలు తీసుకురావాల్సి ఉంటుందంటున్నారు. టౌన్ ప్లానింగ్ అమలు చేసే ప్రాంతంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఉదారంగా ధర నిర్ణయిస్తుంది. చివరికి ఈ చట్టం అమలు చేస్తే భూములను రైతులు ప్రభుత్వానికి ఇవ్వక తప్పదు.
ల్యాండ్ పూలింగ్ వల్లనే భూయజమానులు, రైతులకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. అదే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే ఎకరానికి గరిష్టంగా ఒక లక్ష రూపాయల వరకు పెరిగే అవకాశాలున్నాయి. రైతులను అభివృద్ధిలో భాగస్వాములు చేసే విధంగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రూపొందిస్తే కొత్త రాజధానికి రైతులు ఉదారంగా తమ భూములు ఇచ్చేందుకు ముందుకు రావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ముందుగా విజయవాడ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్కు సంబంధించి కన్సల్టెంట్ను నియమించాల్సి ఉంది. హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎఎస్సిఐ) ఈ విషయమై అధ్యయనం చేసి మంచి కన్సల్టెంట్ను నియమించాలని ప్రభుత్వం కోరింది. ఆరు నెలల్లోగా కన్సల్టెంట్ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలి. గతంలో వీజీటీఎం మాస్టర్ ప్లాన్ నిమిత్తం ఒక కన్సల్టెంట్ను నియమించింది.
2031 నాటికి వీజీటీఎం అవసరాలు, పెరిగిన జనాభాను అంచనా వేసి మాస్టర్ ప్లాన్ను రూపొందించేందుకు ఒక కన్సల్టెంట్ను నియమించారు. ఈ సంస్థ గత ఏడాది డిసెంబర్ నుంచి పని మొదలు పెట్టింది. 2015 డిసెంబర్ లోపల ఈ సంస్థ నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29వ తేదీన ఆస్కికి మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్ నియామకం, నివేదిక రూపకల్పన బాధ్యతలు అప్పగిస్తూ కమిటీని నియమించింది.
కాగా, ప్రభుత్వం రాజధాని సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనికి మంత్రి నారాయణ చైర్మన్గా ఉన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. భూసేకరణ వ్యవహారాలను ఈ కమిటీ చూస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉద్యోగులు, కార్యాలయాల తరలింపునకు ఒక కమిటీని వేశారు.
ఇప్పుడు మాస్టర్ ప్లాన్కు ఒక కమిటీని వేశారు. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపి వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులు కన్సల్టెంట్ కోసం మార్గదర్శకాలను ఖరారు చేస్తారు. తాజాగా క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కదులుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications