దొంగాట: అయ్యన్న, హోదాపై బీజేపీకి షాకిచ్చేలా బాబు ప్లాన్, ఢిల్లీలో ఫైట్!
విశాఖ: ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేత, ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు బీజేపీ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ దొంగాట ఆడుతోందని ధ్వజమెత్తారు. విభజన హామీలను బీజేపీ నెరవేర్చాలన్నారు.
రాజధాని అమరావతి గురించి ఏపీ బీజేపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. విశాఖలో నిర్వహించిన టిడిపి మినీ మహానాడులో ఆయన పాల్గొని, మాట్లాడారు. మినీ మహానాడులో అయ్యన్నపాత్రుడు సహా మంత్రులు గంటా, కొల్లు రవీంద్ర, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అన్నారు. దానిని అమలు చేయాలన్నారు. ఏపీకి ఢిల్లీని మించిన రాజధానిని కడదామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని, ఆ హామీని ఆయన నిలబెట్టుకోవాలని కోరుతున్నామన్నారు.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో గ్రేటర్ విశాఖ ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. గ్రేటర్ విశాఖలో పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. జీవీఎంసీ పైన టిడిపి జెండా ఎగరాల్సిందేనని అయ్యన్న అన్నారు.

బీజేపీపై బాబు వ్యూహం, హోదాపై టిడిపి డబుల్ ప్లాన్!
ఓవైపు హోదా తో ఏం వస్తోందని చెబుతూనే, మరోవైపు ఆ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు టిడిపి ప్రయత్నాలను చేస్తోందని అంటున్నారు. ప్రత్యేక హోదా వస్తే.. ఒక లాభం, అది తమ వల్ల వచ్చిందని చెప్పుకోవడానికి ఒక ప్లాన్ను, అది గనుక రాకపోతే దాని కోసం తాము తీవ్రంగా ప్రయత్నించాం కానీ.. బీజేపీనే దానికి సహకరించ లేదనే రెండో గేమ్ ప్లాన్తో టిడిపి ముందుకు ముందుకెళ్లేందుకు స్కెచ్ వేస్తోందట.
హోదా కోసం అంశం గురించి ఇప్పుడు ఇతర పార్టీల మద్దతును కూడబెట్టేందుకు టిడిపి సిద్ధమవుతోందని అంటున్నారు. అందుకోసం ఢిల్లీలో ఇతర పార్టీ నేతలను కలవనున్నారంటున్నారు. ఈ అంశం పై లోకసభలో చర్చ జరిగిందని, అప్పుడు అన్ని పార్టీలూ విభజనకు అనుకూలంగా నిలిచాయంటున్నారు.
కాబట్టి ఇప్పుడు హోదా అంశాన్ని అన్ని పార్టీలూ బాధ్యతగా తీసుకోవాలని టిడిపి నేతలు దేశంలోని ఇతర పార్టీల నేతలను కోరనున్నారని తెలుస్తోంది. దీని కోసం టిడిపి నేతలు త్వరలోనే ఢిల్లీ యాత్రను చేపట్టనున్నారని అంటున్నారు. అయితే, చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా, తన పార్టీ ఎంపీలను దీని కోసం రంగంలోకి దించనున్నారని అంటున్నారు.
హోదా విషయంలో బీజేపీతో కట్టెవిరగని, పాము చావని విధంగా గేమ్ ఆడాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఒకవైపు తను బీజేపీని వెనకేసుకు వస్తున్నట్టుగా మాట్లాడుతూ, మరోవైపు తన పార్టీ ఎంపీలను రంగంలోకి దించి, తద్వారా బీజేపీని దోషిగా, బీజేపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం బాబు చేస్తున్నారని అంటున్నారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని టీడీపీ భావిస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications