‘ఆ ట్రస్టుపై విజయసాయి కన్ను.. చంద్రబాబు చేతులెత్తి మొక్కినా అమరావతిని నిర్వీర్యం చేశారు’
అమరావతి: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అధికార వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విజయమ్మను ఓడించినందుకు దేవుడు విధించిన శిక్షే హుధుద్ అంటూ రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు విశాఖపై కపట ప్రేమ నటిస్తున్నారని దుయ్యుబట్టారు.
ఆ ట్రస్టుపై విజయసాయి కన్ను..
‘మీ(వైసీపీ) ప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలపై కాదు ఇక్కడి భూమిపై మాత్రమే. విజయనగరానికి తలమానికమైన మాన్సాస్ ట్రస్ట్ ని చెరబట్టారు' అని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ‘50 వేల కోట్ల ఆస్తులు కలిగిన ట్రస్ట్పై విజయసాయి రెడ్డి కన్నుపడింది. విశాఖలో కబ్జాలు,భూదందాల పర్వం మొదలయ్యింది. విశాఖని విజయసాయి రెడ్డి రియల్ ఎస్టేట్ దందాకు అడ్డగా మార్చుకున్నారు' అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
పట్టుబడితే మీ వాళ్లు కాదా విజయసాయీ..?
‘పట్టుబడిన వాళ్ళు నా వాళ్ళు కాదంటూ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ చూస్తే నవ్వొస్తుంది. అంటే పట్టుబడకుండా దందా చేస్తున్న వాళ్ళు మాత్రమే మీ వాళ్ళావిజయసాయి రెడ్డి..' అంటూ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.
బంగారుబాతులాంటి అమరావతిని నిర్వీర్యం చేశారు...
ఇది ఇలావుండగా, మూడు రాజధానుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్లో రగడ నెలకొన్న విషయం తెలిసిందే. అమరావతినే కొనసాగించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. తాజాగా ఈ విషయమై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యా వాణి మీడియా మాట్లాడుతూ.. బంగారుబాతు వంటి అమరావతిని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆమె విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు చేతులెత్తి మొక్కినా..
అమరావతిని నాశనం చేయొద్దంటూ అసెంబ్లీలో రెండు చేతులు జోడించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని.. టీడీపీ అధినేత చంద్రబాబు వేడుకున్నారని గుర్తు చేశారు. రంగుల నుంచి రాజధాని వరకు అన్ని నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టాయని దివ్యావాణి ఎద్దేవా చేశారు. అమరావతి రైతులకు కోర్టులే న్యాయం చేస్తాయని తెలిపారు. స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో వాస్తవాలు బహిర్గతం చేయకుండా రమేష్ బాబుపై కక్షసాధింపులు సరికాదని అన్నారు దివ్యా వాణి.