పూలే స్ఫూర్తితో ముందుకు: బాబు, కెసిఆర్, జగన్ నివాళులు
హైదరాబాద్: మహాత్మా జ్యోతీరావు పూలేకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, కేంద్రమంత్రి మంత్రి బండారు దత్తాత్రేయ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, పలు పార్టీల నేతలు శనివారం నివాళులర్పించారు.
పార్టీ కార్యాలయంలో జ్యోతీరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు మాట్లాడుతూ.. పూలే దేశానికి ఎంతో సేవ చేశారని అన్నారు. పూలే స్పూర్తితోనే మనమందరం ముందుకు వెళ్లాలని అన్నారు. అంటరానితనం నిర్మూలనకు పూలే ఎంతో కృషి చేశారని, అయినా దేశంలో ఇప్పటికీ అంటరానితనం ఉండటం బాధాకరమన్నారు.
అందుకే పూల స్ఫూర్తి అందరికీ అవసరమని అన్నారు. ఎన్టీఆర్ కూడా పూలేను స్ఫూర్తిగా తీసుకున్నారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. పేదలు, మహిళలు, మైనార్టీలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. వారందరి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని చంద్రబాబు అన్నారు.
సిఎం కెసిఆర్ నివాళి
నగరంలోని అంబర్పేటలో జరిగిన మహత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. శనివారం పూలే 189వ జయంతి వేడుక. మహాత్మ పూలే జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
రవీంద్రభారతిలో నిర్వహించిన మహాత్మాజ్యోతిబా పూలే జయంతి వేడుకల్లోనూ సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఆయనతోపాటు స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు పాల్గొన్నారు. గాంధీభవన్లోనూ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
జగన్ నివాళి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.