లారెన్స్ను నేనే ఇండస్ట్రీకి పరిచయం చేశా!: బాబూ మోహన్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ ను తానే ఇండస్ట్రీకి పరిచయం చేశానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ : నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ తో భేటీ అయిన సందర్బంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూ మోహన్. హనుమాన్ జంక్షన్ లోని సతీష్ కార్యాలయంలో ఆదివారం నాడు ఆయనతో భేటీ అయ్యారు.ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. సినిమాలే ప్రధానమని ఆయన పేర్కొనడం గమనార్హం.
సినిమాల్లో బిజీగా ఉన్న రోజులను గుర్తుచేసుకుంటూ.. ఒకప్పుడు రోజుకు 6,7 సినిమాల షూటింగుల్లో పాల్గొనేవాడినని, 24గం. సినిమా షూటింగ్స్ తోనే తీరిక లేకుండా గడిచిపోయేదని చెప్పారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ ను తానే ఇండస్ట్రీకి పరిచయం చేశానని ఈ సందర్బంగా బాబూ మోహన్ తెలిపారు. కష్టపడకుండా ఏది సాధించలేమని చెప్పడానికి తానే నిదర్శమని చెప్పారు. చివరిశ్వాస వరకు సినిమాల్లో తన నట ప్రస్థానం కొనసాగుతుందని వివరించారు.
ప్రస్తుతం టాలీవుడ్ కు హాస్య నటుల కొరత లేదని దాదాపు 35మంది హాస్య నటులు తమ ప్రతిభను చాటుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఇక అనూహ్య పరిస్థితుల్లో తాను సినిమాల్లోకి ఎంట్రీకి చెప్పుకొచ్చిన బాబూ మోహన్.. ఇప్పటిదాకా 970 చిత్రాల్లో నటించినట్టుగా తెలిపారు. అంకుశం, మామగారు, మాయలోడు వంటి చిత్రాలు హాస్య నటుడిగా తనకు మంచి గుర్తింపు తెచ్చాయని.. మంచి విజయాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగానని తెలియజేశారు.